దొంగా పోలీస్... వేట!

30 May, 2016 22:50 IST|Sakshi

దారి దోపిడి, అత్యాచారాలతో రెచ్చిపోతున్న రెండు ముఠాలను పోలీసులు ఎలా ఎదుర్కొన్నారనే కథాంశంతో రూపొందనున్న చిత్రం ‘బిట్రగుంట’. ‘ది బిగినింగ్’ అనేది ఉపశీర్షిక. జె.వి నాయుడు, ఎల్లసిరి మురళీధర్ రెడ్డి, ఇషిక ముఖ్యతారలుగా నాగరాజు తలారి దర్శకత్వంలో జాలె వాసుదేవనాయుడు  ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘జూన్ 15 నుంచి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరపనున్నాం.

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పోలీసులకు, గ్యాంగ్ లకు మధ్య సాగే చేజింగ్ సీక్వెన్సెస్, పోరాట సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి’’ అని తెలిపారు. ‘‘రియాలిటీకి దగ్గరగా ఉండే చిత్రం ఇది. నెల్లూరు జిల్లాలో ఎక్కువ భాగం షూటింగ్ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: కరుణాకర్.