విజయ్‌ సేతుపతిపై బీజేపీ నేతల ఫిర్యాదు

18 May, 2020 10:08 IST|Sakshi

నటుడు విజయ్‌ సేతుపతిని ఫిర్యాదులు వెంటాడుతున్నాయి. నటుడిగా విజయపథంలో పయనిస్తున్న ఆయన కొన్ని రోజుల క్రితం దైవ విగ్రహాల గురించి ఒక టీవీ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదాల్లోకి నెట్టాయి. ఆలయాల్లో విగ్రహాలు అభిషేకానికి భక్తులకు అనుమతి ఇస్తున్నారని, అయితే పట్టు వస్త్రాలు ధరించేటప్పుడు మాత్రం అనుమతించరన్న విజయ్‌ సేతుపతి వ్యాఖ్యలు పెనుదుమారాన్నే రేపుతున్నాయి. ఇటీవల తిరుచ్చిలో అఖిల భారత హిందూ మహాసభ నిర్వాహకులు విజయ్‌ సేతుపతి వ్యాఖ్యలను ఖండించారు. అంతేకాకుడా తిరుచ్చిలోని పోలీస్ ‌కమిషనర్‌ కార్యాలయంలో ఆయనపై ఫిర్యాదు చేశారు.

కాగా తాజాగా శనివారం ఈరోడ్‌ జిల్లా బీజేపీ నాయకులు గోపిచెట్టి పాళయంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి విజయ్‌ సేతుపతిపై ఫిర్యాదు చేశారు. అందులో విగ్రహాలపై నటుడు  చేసిన వ్యాఖ్యలు జాతీయ సమైఖ్యతను దెబ్బతీసే విధంగాను, హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగాను ఉన్నాయన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన అతనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. కాగా, బీజేపీ నాయకులు భారీ సంఖ్య లో వెళ్లడంతో  గోపిచెట్టి పాళయం పోలీసు స్టేషన్లో కొంత ఉద్రిక్తత చేటుచేసుకుంది.
  

మరిన్ని వార్తలు