ఆ సినిమాను అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌లలో చూడలేరు

14 Oct, 2019 15:38 IST|Sakshi

ఇటీవలి కాలంలో సినిమాలను డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లపై చూడటానికి జనాలు అలవాటు పడుతున్నారు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటానికి బదులు ఓ నెల రోజులు ఆగితే.. ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు కదా అని కొందరు భావిస్తున్నారు. కొన్ని సినిమాలు థియేటర్లలో ఉండగానే డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌పై ప్రత్యక్షమవుతున్నాయి. ముఖ్యంగా అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌లు కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను హెచ్‌డీ క్వాలిటీతో అందిస్తుండటంతో నెటిజన్లు కూడా డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయా సంస్థలు కూడా యూజర్లను ఆకర్షించేలా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉండే చాలా మంది సినిమాలు చూసేందుకు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఓవర్సీస్‌లో సినిమాల కలెక్షన్లు పడిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో బ్లూస్కై సినిమాస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుకుతున్న ‘అల... వైకుంఠపురములో..’ చిత్రం ఓవర్సీస్‌ హక్కులు దక్కించుకున్న బ్లూస్కై సినిమాస్‌.. ఆ సినిమాను ఆమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌లో చూడలేరని తెలిపింది. అందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే ఈ చిత్రం థియేటర్లలో ఉన్నంతకాలం.. డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉండదని తెలుస్తోంది. ఈ నిర్ణయం ద్వారా ఓవర్సీస్‌లో కలెక్షన్లు రాబట్టుకోవచ్చనేది ఆ సంస్థ ఉద్దేశంగా తెలుస్తోంది. 

కాగా, అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు తివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరిన్ని వార్తలు