బాలీవుడ్ నటుడి బంగ్లా కూల్చివేత

21 Jun, 2017 14:19 IST|Sakshi
బాలీవుడ్ నటుడి బంగ్లా కూల్చివేత

ముంబయి: బాలీవుడ్‌ నటుడికి  ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌(బీఎంసీ) భారీ షాక్‌ ఇచ్చింది. అక్రమ నిర్మాణ ఆరోపణలతో 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' ఫేం  అర్షద్ వార్సీ బంగ్లాను కూల్చి వేసింది. అక్రమంగా అదనపు నిర్మాణాలను చేపట్టినందుకుగాను బీఎంసీ  ఈ నిర్ణయం తీసుకుంది.  ఇటీవల కార్పొరేషన్‌ నోటీసులు స్పందించకపోవడంతో  వెర్సోవాలోని  ఆయన ఇంటిలోని నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేసింది.   

సుమారు నాలుగు సంవత్సరాల క్రితమే ఈ  కేసు  బీఎంసీ దృష్టిలో  ఉంది. కోర్టు ఆదేశాలతో ఇప్పటివరకూ వాయిదాపడింది.  ఇటీవల అర్షద్‌ వార్సీ  తెచ్చుకున్న  స్టే ఆర్డర్‌ను కోర్టు ఎత్తివేసింది. దీంతో ఎయిర్ ఇండియా కో-ఆపరేటివ్ సొసైటీ (శాంతినికేతన్) లో బంగళా నెంబరు 10 ను కూల్చి వేస్తామంటూ కార్పొరేషన్‌ శనివారంనోటీసులు జారీ చేసింది.  రెండవ అంతస్తులో (1,300 చదరపు అడుగుల) అక్రమ నిర్మాణంపై వివరణ ఇవ్వాలని లేదంటే  తొలగిస్తామని హెచ్చరించింది.   దీనికి  వార్సీకి 24 గంటల సమయం కూడా ఇచ్చింది. అయితే నటుడు  నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడం, ఇంటికి తాళం వేసివుండటంతో  సోమవారం పాక్షిక కూల్చివేతను  చేపట్టినట్టు   కార్పొరేషన్‌ అధికారులు చెప్పారు.   దీనిపై అర్షద్‌కు, ఆయన భార్యకు మరోసారి నోటీసులు ఇస్తామన్నారు. మున్సిపల్‌ అధికారుల అనుమతికి సంబంధించిన పత్రాలకోసం తిరిగి నోటీసులు పంపిన అనంతరం అక్రమ అంతస్తును తొలగిస్తామని వార్డ్ అధికారి ప్రశాంత్ గైక్వాడ్  తెలిపారు. అటు ఈ పరిణామాలను నటుడు అర్షద్‌  దృవీకరించారు.

కాగా 2012లో ఎయిర్‌ ఇండియా మాజీ ఉ‍ద్యోగినుంచి ఈ భవనాన్ని కొనుగోలు చేశారు అర్షద్‌. అక్రమ నిర్మాణాలు చేపట్టాడని ఆరోపిస్తూ సొసైటీ సభ్యులు  బీఎంసీకి ఫిర్యాదు చేయడంతో వివాదం రేగింది. దీంతో  2013లో బీఎంసీ ఈనిర్మాణాన్ని తొలగించాలని  భావించినప్పటికీ   కోర్టు స్టే ఇవ్వడంతో  నిలిపివేశారు. ఇటీవల స్టే ఎత్తివేయడంతో రంగంలోకి దిగిన  బీఎంసీ ఈ చర్య చేపట్టింది.  ఇతరులు అనేకమంది ఇలాంటి అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారన్న ఆరోపణ నేపథ్యంలో ఇతర బంగళాలను కూడా బీఎంసీ పరిశీలించింది.