విజయ్‌ సేతుపతి పాత్రలో బాబీ సింహా

25 Apr, 2020 13:08 IST|Sakshi

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్  నేపథ్యంలో సాగే ఈసినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన నటిస్తోంది. తమిళ నటుడు విజయ్‌ సేతుపతి అటవీశాఖ అధికారి పాత్రలో నటిస్తున్నారనే విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్‌ సేతుపతి ప్రకటించారు. అయితే ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్‌ అధికారులు, చాలా మంది తమిళులను స్మగ్లర్లుగా భావించి వారిని కాల్చి చంపిన నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న కారణంగా తమిళ హీరో అయిన విజయ్‌ సేతుపతి ఈ పాత్రలో నటిస్తే తమిళ అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయనే ఉద్ధేశంతో ఆయన‌ ఈ సినిమా నుంచి వైదొలిగినట్లు సమాచారం. (‘పుష్ప’ సర్‌ప్రైజ్‌: బన్నీకి లవర్‌గా నివేదా)

అయిదు భాషల్లో విడుదల కానున్న ‘‘పుష్ప’ సినిమా లాక్‌డౌన్‌తో షూటింగ్‌ వాయిదా పడటంతో మళ్లీ ఎప్పుడు చిత్రీకరణ ప్రారంభం అవుతుందో తెలియని కారణంగా విజయ్‌ డేట్లు సర్దుబాటు చేయలేనని సైడ్‌ అయినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విజయ్‌ పాత్రలో మళ్లీ తమిళ నటుడినే తీసుకోవాలని అనుకున్న చిత్ర బృందం తాజాగా బాబీ సింహాతో చర్చలు జరుపుతున్నట్లు సినిమా ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి నటిస్తున్నారు. మరో హీరోయిన్‌ పాత్రలో కేరళ కుట్టి నివేదా థామస్ కనిపించనున్నారు. (పుష్ప సినిమాకు విల‌న్ ఖ‌రారు!)

మరిన్ని వార్తలు