పంద్రాగస్టుకి బాక్సాఫీస్‌ పోటీ!

23 Dec, 2018 02:21 IST|Sakshi
ప్రభాస్

వచ్చే పంద్రాగస్టుకి బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద ప్రభాస్, జాన్‌ అబ్రహాం, అక్షయ్‌ కుమార్, రాజ్‌కుమార్‌ రావ్‌ పోటీ పడనున్నారు. ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద 500 కోట్లు కలెక్ట్‌ చేసిన హిందీ చిత్రాల జాబితాలో ‘బాహుబలి 2’ హిందీ వెర్షన్‌ టాప్‌ ఫైవ్‌లో ఉంటుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ ‘బాహుబలి’ తన స్టామినా నిరూపించుకుంది. ఆ విధంగా ప్రభాస్‌ మార్కెట్‌ ఇతర భాషల్లోనూ పెద్దదైంది.

అందుకే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ చేస్తున్న ‘సాహో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందుతోన్న ఈ సినిమాను వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. బీ టౌన్‌లో ప్రొడ్యూసర్‌ భూషణ్‌ కుమార్‌ రిలీజ్‌ చేయనున్నారు. ‘సాహో’ చిత్రాన్ని వచ్చే ఆగస్టు 15న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి మరో మూడు హిందీ సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి.

దీంతో ఈ సినిమాల రిలీజ్‌ల గురించి బాలీవుడ్‌లో జోరుగా చర్చ మొదలైంది. అవి ‘మిషన్‌ మంగళ్‌’, ‘బాల్తా హౌస్‌’. ‘మేడ్‌ ఇన్‌ చైనా’. అక్షయ్‌ కుమార్, విద్యాబాలన్, తాప్సీ, నిత్యామీనన్, సోనాక్షీ సిన్హా ముఖ్య తారలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిషన్‌ మంగళ్‌’. జగన్‌ శక్తి ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు. ఇస్రో (ఇండియన్‌ స్పెస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) మార్స్‌ మిషన్‌లో కీలక పాత్ర పోషించిన మహిళా శాస్త్రవేత్తల కృషి ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

ఇక ‘బాల్తా హౌస్‌’ గురించి చెప్పాలంటే.. దాదాపు పదేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన ఆపరేషన్‌ బాల్తా హౌస్‌ ఇన్సిడెంట్‌ ఆధారంగా నిఖిల్‌ అద్వానీ దర్శకత్వంలో జాన్‌ అబ్రహాం హీరోగా రూపొందుతున్న సినిమా ఇది. రాజ్‌కుమార్‌ రావ్‌ హీరోగా మిఖిల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘మేడ్‌ ఇన్‌ చైనా’. చైనా ప్రాడెక్ట్స్‌ గురించి ఈ సినిమా ఉంటుందని భోగట్టా. ఈ మూడు సినిమాలనూ వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ఆయా చిత్రబృందాలు వెల్లడించాయి.

ఇప్పుడు ‘సాహో’ కూడా సీన్లోకొచ్చింది. ఒకేరోజు నాలుగు సినిమాలంటే బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ షేర్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే వచ్చే ఏడాది ఇండిపెండెన్స్‌ డే గురువారం వచ్చింది. ఆ రోజు పబ్లిక్‌ హాలీడే. నెక్ట్స్‌ వీకెండ్‌ స్టారై్టపోయింది. గురు, శుక్ర, శని, ఆదివారం.. వరుసగా నాలుగు రోజులు వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది కాబట్టి, నాలుగు చిత్రాల నిర్మాతలూ తమ సినిమాని రిలీజ్‌ చేసే విషయంలో వెనక్కి తగ్గే అవకాశం లేకపోవచ్చు. మరి.. వచ్చే పంద్రాగస్టుకి ఏ సినిమా నిర్మాత  ఆలోచన అయినా మారుతుందా? వెయిట్‌ అండ్‌ సీ.


గతేడాది అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’, ఈ ఏడాది ఆయన నటించిన ‘గోల్డ్‌’ సినిమాలు ఆగస్టు 15న విడుదలై మంచి వసూళ్లను రాబట్టాయి. ఇదే సెంటిమెంట్‌తో అక్షయ్‌ కుమార్‌ ‘మిషన మంగళ్‌’ చిత్రాన్ని వచ్చే ఏడాది పంద్రాగస్టుకు రిలీజ్‌ చేయాలనుకుంటున్నారని బాలీవుడ్‌ సమాచారం. సేమ్‌ జాన్‌ అబ్రహాం ఈ ఏడాది హీరోగా నటించిన ‘సత్యమేవ జయతే’ ఆగస్టు 15న విడుదౖలై మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. అందుకే ‘బాల్తా హౌస్‌’ చిత్రాన్ని కూడా సేమ్‌ రిలీజ్‌కు అబ్రహాం రెడీ చేశారని బాలీవుడ్‌ టాక్‌. ‘సత్యమేవ జయతే, బాల్తా హౌస్‌’ రెండు చిత్రాల్లో జాన్‌ అబ్రహాంది పోలీస్‌ క్యారెక్టర్‌నే కావడం విశేషం.

ప్రభాస్, జాన్‌ అబ్రహాం, అక్షయ్‌ కుమార్, రాజ్‌కుమార్‌ రావ్‌. వీళ్లందరీ కంటే వచ్చే ఏడాది పంద్రాగస్టు రిలీజ్‌ డేట్‌ను ఫస్ట్‌ ఫిక్స్‌ చేసుకుంది హీరో రణ్‌బీర్‌ కపూర్‌. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో అమితాబ్‌ బచ్చన్, రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. కరణ్‌ జోహార్‌ నిర్మాత. మూడు పార్ట్స్‌గా రానున్న ఈ సినిమా తొలి పార్ట్‌ను ఆగస్టు 15కు రిలీజ్‌ చేద్దాం అనుకున్నారు. కానీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పెండింగ్‌లో ఉండటంతో వచ్చే ఏడాది తొలి పార్ట్‌ను క్రిస్మస్‌కు వాయిదా వేశారు ‘బ్రహ్మాస్త్ర’ టీమ్‌. ఈ సినిమాలో నాగార్జున, డింపుల్‌ కపాడియా కూడా కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.


జాన్‌ అబ్రహాం


రాజ్‌కుమార్, మౌనీ


‘మిషన్‌ మంగళ్‌’ టీమ్‌


‘బ్రహ్మాస్త్ర’ టీమ్‌

మరిన్ని వార్తలు