రెండేళ్ల తర్వాత బాలీవుడ్‌లో సంబురాలు

14 Jul, 2018 12:39 IST|Sakshi

దాదాపు రెండేళ్ల తర్వాత బాలీవుడ్‌లో పండగ వాతావరణం కనిపిస్తోంది. సంజు చిత్రం రూ. 500 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్‌ దత్‌ బయోపిక్‌గా తెరకెక్కిన సంజులో రణ్‌బీర్‌ కపూర్‌ లీడ్‌ రోల్‌ పోషించగా, రాజ్‌కుమార్‌ హిరాణీ డైరెక్టర్‌. సంజు బాబా లైఫ్‌లోని ప్రధాన కోణాలతో ఈ చిత్రాన్ని భావోద్వేగంగా హిరాణీ తెరకెక్కించాడు. తొలిరోజు రూ.34 కోట్లు రాబట్టి ఈ ఏడాది హయ్యెస్ట్‌ ఓపెనర్‌గా నిలిచిన సంజు.. వరుస డిజాస్టర్లతో అయోమయంలో ఉన్న రణ్‌బీర్‌ కెరీర్‌కు భారీ సక్సెస్‌ ఇచ్చింది. 

అమీర్‌ఖాన్‌ దంగల్‌(2016 డిసెంబర్‌) తర్వాత రిలీజ్‌ అయిన (బాహుబలి-2ని మినహాయిస్తే...) చిత్రాలేవీ పట్టుమని మూడు వందల కోట్ల క్లబ్‌లో చేరలేకపోయాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ట్యూబ్‌లైట్‌.. షారూఖ్‌ నటించిన జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌లు చతికిలపడగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన టైగర్‌ జిందా హై, రేస్‌-3.. పద్మావత్‌ లాంటి చిత్రాలు ఆ ఫీట్‌ను సాధించలేకపోయాయి. ఈ తరుణంలో బిగ్గెస్ట్‌ హిట్‌ కోసం బాలీవుడ్‌ దాహాన్ని సంజు తీర్చేసింది. ఇండియాలో రెండువారాల్లో 378 కోట్ల (గ్రాస్‌), రూ.295 కోట్ల(నెట్‌) వసూళ్లు(తొలివారంలోనే రూ.202 కోట్లు) రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ.122 కోట్లు వసూలు చేసింది. యూఎస్‌లో 7 మిలియన్‌ క్లబ్‌ దాటేసి ఇంకా దూసుకుపోతోంది. 

విమర్శలు... అయితే సంజు జీవితంలోని చీకటి కోణాలు పేరిట రాజ్‌కుమార్‌ హిరాణీ తప్పులను కప్పిపుచ్చాడని పలువురు విమర్శలకు దిగారు. ఈ క్రమంలో మిశ్రమ రివ్యూలు ఇవ్వటంతోపాటు, పలు కోణాల్లో క్రిటిక్స్‌ సంజును తప్పుబట్టారు. అయితే తన జీవితం తెరిచిన పుస్తకమని, దాచేందుకు ఏం లేదంటూ విమర్శలపై సంజయ్‌ దత్‌ అంతే ఘాటుగా స్పందించారు.

మరిన్ని వార్తలు