రాజమౌళి స్థాయిని తక్కువ చేయడమే..!

26 Mar, 2017 23:16 IST|Sakshi
బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వస్తున్నా..

హైదరాబాద్: దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి-2'. ఈ మూవీ కోసం టాలీవుడ్ అభిమానులతో పాటు బాలీవుడ్ దర్శకనిర్మాతలు, నటులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్‌లో నేటి సాయంత్రం ప్రారంభమైన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ నగరానికి వచ్చాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తాను పాలు పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నాడు.

భారత సినీ చరిత్రలో ఎస్ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి ప్రాజెక్టులు ఎవర్ గ్రీన్ అని కరణ్ ప్రశంసించాడు. భారత్‌లో గొప్ప దర్శకుడు అని చెప్పడం రాజమౌళి స్థాయిని చాలా తక్కువచేసి చెప్పడమే అవుతుందని, హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ లాంటి వ్యక్తులతో పోలిక సరైనదని చెప్పాడు. బాహుబలిని మనకు అందించిన నిర్మాతలను కచ్చితంగా అభినందించక తప్పదన్నాడు. తనను ఇలాంటి భారీ ఈవెంట్‌కు ఆహ్వానించినందుకు బాహుబలి యూనిట్‌కు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ ధన్యావాదాలు తెలిపాడు .

ప్రపంచంలోనే తొలిసారిగా బాహుబలి-2 సినిమా ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ను వర్చువల్‌ రియాల్టీలో ప్రసారం చేసి మూవీ యూనిట్ రికార్డు నెలకొల్పనుంది. ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌ రియాల్టీలోనూ ప్రసారం చేసేందుకు సినిమా కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌కు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లు అందిస్తున్న సంస్థ ఏఎండీకి చెందిన రేడియాన్‌ టెక్నాలజీస్‌ గ్రూప్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఫంక్షన్‌ను వీక్షించేందుకు బాహుబలి అభిమానులు తరలి వచ్చారు.

బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ - ఫోటో గ్యాలరీ