ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌కు కరోనా పాజిటివ్‌

20 Mar, 2020 14:39 IST|Sakshi

లక్నో : ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్‌లోనూ కరోనా ప్రవేశించడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు, పార్క్‌లు, జిమ్ములు, సినిమా థియేటర్లు, దేవాలయాలు మూసి వేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఇక సెలబ్రిటీలు కూడా సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ చెప్పి ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ సింగర్‌కు కరోనా సోకినట్లు శుక్రవారం తెలిసింది. బాలీవుడ్‌ గాయని కనికా కపూర్‌కు కరోనా పాజిటీవ్‌గా నిర్ధారించినట్లు డాక్టర్లు వెల్లడించారు. బాలీవుడ్‌లో ఎన్నో హిట్‌ పాటలు ఆమె గొంతు నుంచి జాలువారాయి. ‘బేబి డాల్‌, చిట్టియాన్‌ కలైయాన్‌’ వంటి ప్రాచుర్యం పొందిన పాటలను ఆమె ఆలపించారు. (‘టాప్‌ స్టార్లు వారిని ఆదుకోవాలి’)

కాగా కొంతకాలం లండన్‌లో ఉన్న కనికా మార్చి 15న లక్నోకు తిరిగి వచ్చారు. లక్నో చేరుకున్న తరువాత కనికా తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు హాజరైనట్లు తెలుస్తోంది. అనంతరం కనికా లక్నోలోని ఓ పెద్ద అపార్ట్‌మెంట్‌లో బస చేశారు. అయితే శుక్రవారం ఉత్తర ప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించగా అందులో నలుగురికి పాజిటివ్‌ తేలినట్లు అధికారులు వెల్లడించారు. అందులో గాయని కనికా ఒకరు. ప్రస్తుతం ఆమెను ​లక్నోలోని కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేర్చి వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా లండన్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కనికా తన ప్రయాణ వివరాలను దాచిపెట్టినట్లు సమాచారం. (పదో తరగతి పరీక్షలు వాయిదా)

>
మరిన్ని వార్తలు