అప్పుడు నన్నెవరూ గుర్తుపట్టలేదు : బొమన్‌ ఇరానీ

25 Dec, 2019 20:10 IST|Sakshi

బాలీవుడ్‌ నటుడు బొమన్‌ ఇరానీ వినూత్నమైన నటనతో ప్రేక్షకులను తనదైన శైలిలో మెప్పిస్తానడంలో సందేహం లేదు. ఎటువంటి పాత్రలైనా సరే తన దగ్గరికి వస్తే పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి కసరత్తు చేయడం ఆయనకు అలవాటు. తాజాగా... రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వంలో 2009 లో బ్లాక్‌బాస్టర్‌ మూవీ త్రీ ఇడియట్స్‌ వచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బొమన్‌ ఇరానీ తాను పోషించిన పాత్ర గురించి, ఆ పాత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. త్రీ ఇడియట్స్‌ చిత్రంలో బొమన్‌ ఇరానీ ఐఐఎమ్‌ బెంగుళూరు కాలేజీ డైరెక్టర్‌ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. అందులో ఆయన పాత్ర పేరు డాక్టర్ విరు సహస్త్రాబుద్ధా వైరస్. ఈ పాత్ర కోసం తాను ఎలా సిద్ధమాయ్యరో బొమన్‌ ఇరానీ మీడియాకు వివరించారు.

'త్రీ ఇడియట్స్‌ సినిమా సమయంలో ప్రతిరోజు ఉదయం షూటింగ్‌ ఉన్నా లేకపోయినా పాత్రకు సంబంధించిన వెల్‌క్రో షర్ట్‌, హుక్‌ టైని ధరించి క్యాంపస్‌ మొత్తం కలియతిరిగేవాడిని. అయితే నన్ను చూసిన కొందరు విద్యార్థులు గుర్తుపట్టకపోగా ఒక ఫ్రొఫెసర్‌గా భావించి విష్‌ చేసేవారు. ఒక్కోసారి వారిపై అరుస్తూ నా కోపాన్ని ప్రదర్శించడంతో వారంతా ఆశ్చర్యపోయేవారు. క్లాస్‌రూంలో పాఠాలు బోధిస్తున్న సమయంలో అక్కడికి వెళ్లి క్లాస్‌రూం మొత్తం పరిశీలించి మీ పని చేసుకొండి అని చెప్పి వెళ్లిపోయేవాడిని. ఆ సమయంలో అక్కడే ఉన్న లెక్చరర్స్‌ నేను కాలేజ్‌లో కొత్తగా చేరిన ఫ్రొపెసర్‌గా భావించేవారు. కాకపోతే అక్కడి వాతావరణం, పరిస్థితులను అధ్యయనం చేయడం కోసమే ఇదంతా చేశాను. దీంతో షూటింగ్‌ సమయంలో ఒక 20-30 సంవత్సరాల పాటు నాకు ఆ క్యాంపస్‌తో పరిచయంలాగా అనిపించేదని' బొమన్‌ ఇరానీ పేర్కొన్నారు.  

కాగా 2009లో విడుదలైన త్రీ ఇడియట్స్‌ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గానూ పెద్ద విజయం సాధించింది. భారతీయ విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ఈ చిత్రంలో చూపించారు. కాగా ఇదే చిత్రం తమిళంలో శంకర్‌ ‘నన్బన్‌’గా రీమేక్‌ చేశాడు. బొమన్‌ ఇరానీ పాత్రను ఇక్కడ సత్యరాజ్‌ పోషించగా, తెలుగులో స్నేహితుడు పేరుతో విడుదలైంది. 

>
మరిన్ని వార్తలు