‘శ్రీదేవి బంగ్లా’ను బోనీ అడ్డుకుని తీరతారు!

18 Jan, 2019 08:57 IST|Sakshi

సోషల్‌ మీడియా సెన్సేషన్‌ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. మలయాళ దర్శకుడు ప్రశాంత్‌ దర్శకత్వం వహిస్తున్న ‘శ్రీదేవి బంగ్లా’ అనే మూవీలో ప్రధాన పాత్రలో ఆమె నటిస్తున్నారు. శ్రీదేవి అనే సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ పాత్రలో ప్రియా కనిపించనున్నారు. అయితే ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోగా చిత్ర యూనిట్‌కు కష్టాలు తెచ్చిపెట్టింది. సినిమా టైటిల్‌, ట్రైలర్‌లో హీరోయిన్‌ బాత్‌టబ్‌లో పడి చనిపోవడం వంటి సీన్లు ఉండటంతో దివంగత నటి శ్రీదేవి జీవితం ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కుతోందా అనే అనుమానాలు నెలకొన్నాయి.

ఈ క్రమంలో శ్రీదేవి భర్త, బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌.. ప్రియా ప్రకాశ్‌, ఈ చిత్ర దర్శకుడికి లీగల్‌ నోటీసులు పంపారు. దీంతో శ్రీదేవి అన్న పేరు చాలా మంది అమ్మాయిలు పెట్టుకుంటారని, ఈ విషయమై బోనీతో చర్చిస్తామని ప్రశాంత్‌ పేర్కొన్నాడు. కాగా బోనీ కపూర్‌ ఈ సినిమాను అంత తేలికగా తీసుకోబోవడం లేదని ఆయన సన్నిహితులు తెలిపారు.

ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ తన భార్య పేరును, ఆమె పేరిట ఓ నీతిలేని కథను తెరకెక్కించడాన్ని బోనీ అంగీకరించలేరు. ఈ సినిమాను నిలిపివేసేంత వరకు బోనీ కపూర్‌ అస్సలు ఊరుకోరు. వారి సినిమా గురించి ప్రజల్లో ఆసక్తి రేకెత్తించేందుకు శ్రీదేవి బంగ్లా అనే పేరు పెట్టుకోవచ్చు. అయినప్పటికీ బోనీ వీటన్నింటిని సహించరు. సినిమాను ఆపేందుకు ఆయన చట్టబద్ధంగా ముందుకు వెళ్తారు’ అని వ్యాఖ్యానించారు. బోనీ కపూర్‌ పట్టుదల చూస్తుంటే ‘శ్రీదేవి బంగ్లా’కు చిక్కులు తప్పేలా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేస్తామంటూ చిత్ర యూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు