22మంది అతిథుల సమక్షంలో పెళ్లి!

17 Jul, 2014 00:21 IST|Sakshi
22మంది అతిథుల సమక్షంలో పెళ్లి!

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. ఈ రెండూ ఒకేసారి చేస్తే, మధ్యతరగతి కుటుంబాలవారు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే. కానీ, హాలీవుడ్ తారలు బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ వంటి కోటీశ్వరులకు ఇది చాలా చిన్న విషయం. ఈ ఇద్దరూ ఒకవైపు ఇల్లు కట్టిస్తున్నారు... మరోవైపు తమ పెళ్లికి సంబంధించిన సన్నాహాలు చేసుకుంటున్నారు. తాము ప్రేమలో పడ్డ విషయాన్ని పదేళ్ల క్రితం ప్రకటించింది ఈ జంట. ఎట్టకేలకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది చివర్లో లేక వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఉంగరాలు మార్చుకోవాలని వీరిద్దరూ నిశ్చయించుకున్నారు.

పెళ్లయిన తర్వాత ఉండటం కోసం ఓ ఇల్లు కట్టిస్తున్నారు. ఇంటిపని ఇప్పుడు తుది మెరుగుల దశలో ఉంది. మరోవైపు పెళ్లిబట్టలు, నగలను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకునే పని మీద ఉన్నారిద్దరూ. అదేం లెక్కో కానీ.. కేవలం 22 మంది అతిథులను మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానించాలనుకున్నారట. అత్యంత నిరాడంబరంగా వివాహం చేసుకోనున్నామనీ, జీవితానికి తీపి గుర్తుగా నిలిచే ఆ తేదీ ఏమిటన్నది త్వరలోనే ప్రకటిస్తామనీ బ్రాడ్, జోలీ జంట పేర్కొంది.