నేనెవర్నీ ప్రేమించలేదు

26 Jul, 2018 01:06 IST|Sakshi
ఈషా రెబ్బా

‘‘బ్రాండ్‌ బాబు’ చిత్రం ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ప్యూర్‌ కామెడీతో పాటు సెంటిమెంట్, రొమాన్స్‌.. ఇలా అన్ని ఎమోషన్లు ఉన్నాయి. అన్నింటికీ మించి చక్కటి ప్రేమ కథ కూడా ఉంటుంది. కుటుంబమంతా కలిసి మా సినిమా హాయిగా చూడొచ్చు’’ అని కథానాయిక ఈషా రెబ్బా అన్నారు.  సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ, మురళీ శర్మ ముఖ్య తారలుగా ప్రభాకర్‌.పి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రాండ్‌ బాబు’. డైరెక్టర్‌ మారుతి సమర్పణలో ఎస్‌.శైలేంద్రబాబు నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర చాలా కీలకమైంది.

నాకు, హీరోకి మధ్య ప్రేమ ఎలా మొదలవుతుంది? ప్రేమలో ఎదురయ్యే మిస్‌ అండర్‌స్టాండింగ్స్‌ ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాం? అన్నది ఆసక్తికరం. ఓ రకంగా చెప్పాలంటే కథ మొత్తం మారుతిగారి శైలిలోనే సాగుతుంది. చాలా మంది హీరో పాత్రలో మమేకం అవుతారు. ఆ క్యారెక్టర్‌ను అలా డిజైన్‌ చేశారు మారుతిగారు. సుమంత్‌ శైలేంద్ర కన్నడలో రెండు మూడు చిత్రాల్లో నటించాడు. తెలుగులో ఇదే మొదటి చిత్రం. నా పాత్రలన్నింటికీ నేనే డబ్బింగ్‌ చెప్పా. ఇప్పటి వరకూ నేను ఎవర్నీ ప్రేమించలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్‌గారి ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో ముఖ్యమైన పాత్రలో, సుమంత్‌గారితో ఓ సినిమా చేస్తున్నా’’ అన్నారు.

మరిన్ని వార్తలు