కాపాడేవారెవరు రా?

21 Apr, 2019 03:49 IST|Sakshi
సత్యదేవ్, నివేదా థామస్, వివేక్‌ ఆత్రేయ, అనిల్‌ రావిపూడి, శ్రీవిష్ణు, విజయ్‌కుమార్‌ మన్యం

‘‘బ్రోచేవారెవరురా... అంటూ దర్శకుడు వివేక్‌ ఆత్రేయ ఈ టైటిల్‌ చెప్పగానే కొంచెం కన్‌ఫ్యూజ్‌ అయ్యాను. దాని అర్థం‘కాపాడేవారు ఎవరురా?’ అని చెప్పారు. కథ విన్నాక టైటిల్‌ ఈ సినిమాకు సూట్‌ అవుతుందనిపించింది’’ అని శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు, నివేదా థామస్‌ జంటగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. మన్యం విజయ్‌కుమార్‌ నిర్మాత. సత్యదేవ్, నివేదా పేతురాజ్, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం దర్శకుడు అనిల్‌ రావిపూడి రిలీజ్‌  చేసి, మాట్లాడుతూ – ‘‘శ్రీవిష్ణు చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాకు నేను క్లాప్‌ కొట్టాను. ఆ సినిమా బాగా ఆడింది. ‘బ్రోచేవారెవరురా’ ట్రైలర్‌ చాలా ఫన్నీగా, హాంటింగ్‌గా ఉంది.

సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను. ‘మెంటల్‌ మదిలో’ సినిమాతో ఆల్రెడీ వివేక్‌ ప్రూవ్‌ చేసుకున్నాడు. ఇప్పుడు చేసిన ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘వివేక్‌ ఫస్ట్‌ ఈ కథ చెప్పగానే బాగా నచ్చింది. అందరికీ కనెక్ట్‌ అయ్యే కథ ఇది. అద్భుతమైన క్వాలిటీతో మన్యం విజయ్‌గారు నిర్మించారు. ఆయన మన్యం పులిలా విజృంభించి మరిన్ని సినిమాలు తీయాలి’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘ఇది టీమ్‌ వర్క్‌. ఇందులో ‘మంత్ర’ అనే పాత్ర చేశాను’’ అన్నారు నివేదా థామస్‌. ‘‘మెంటల్‌ మదిలో’ చూసి వివేక్‌తో ఓ సినిమా చేయాలనుకున్నాను. లక్కీగా ఈ ప్రాజెక్ట్‌ సెట్టయింది. యాక్టర్స్, టెక్నీషియన్స్‌ అందరూ తమ సపోర్ట్‌ అందించారు. జూన్‌లో సినిమా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత విజయ్‌కుమార్‌.

మరిన్ని వార్తలు