గాయకులు ఆనంద్‌కు బైపాస్ సర్జరీ

18 Mar, 2016 03:39 IST|Sakshi

చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రముఖ సినీ నేపథ్యగాయకులు, సంగీత దర్శకులు జీ ఆనంద్ ఈనెల 8వ తేదీన బైపాస్ సర్జరీ చేసుకుని బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. స్వల్ప అస్వస్థకు గురైన ఆనంద్‌కు ఈ నెల 4వ తేదీన వైద్యపరీక్షలు నిర్వహించగా గుండెకవాటంలో మూడు బ్లాకులు ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉంది, వెంటనే బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించా రు. సమాచారం అందిన వెంటనే అమెరికాలో ఉంటున్న ఆయన కుమారులు అరవింద్ గాదెళ్ల, అరుణ్ గాదెళ్ల హుటాహుటిన చెన్నై చేరుకున్నారు.  8వ తేదీన చెన్నై ఫోర్టిస్ మలర్ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీని విజయవంతంగా పూర్తిచేశారు.
 
 ‘నాకిది పునర్జన్మ’: ఆనంద్
 ఆరోగ్యంగా తిరుగుతున్న నేను అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురికావడం కలచివేసింది. నిత్యం నన్ను సంప్రదించే సన్నిహితులకు మాత్రమే సమాచారం ఇవ్వగలిగాను. వాస్తవానికి నాకిది పునర్జన్మ. ఫోన్‌లో క్షేమసమాచారాలు తెలుసుకుంటున్నవారితో మాట్లాడలేని స్థితిలో ఉన్నాను. నా కోసం ప్రార్థనలు చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆనంద్‌ను ఎస్పీబీ పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.