నా కొడుకుకు సాయం చేయండి ప్లీజ్‌

29 Aug, 2017 04:46 IST|Sakshi
నా కొడుకుకు సాయం చేయండి ప్లీజ్‌

తమిళసినిమా:  నా కొడుకుకు ఎవరైనా సాయం చేయండి ప్లీజ్‌ అంటూ నటి సుహాసిని మణిరత్నం వేడుకున్నారు. అదేమిటీ ఆమెకలాంటి దుస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తవచ్చు. పరిస్థితుల ప్రభావం ఆమెనలా విజ్ఞప్తి చేసేలా చేసింది. దర్శకుడు మణిరత్నం, సుహాసిని దంపతులకు నందన్‌ అనే కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. అతనికి వారి తల్లిదండ్రుల మాదిరిగా సినిమాల్లో రాణించాలన్న ఆసక్తి లేదట. ఈ విషయాన్ని నటి సుహాసినే ఒక భేటీలో తెలిపారు. తన కొడుకుకు రాజకీయాల్లో రాణించాలన్న ఆసక్తి ఉందని చెప్పారు. కాగా నందన్‌ ఇటలీలో పాలిటిక్స్‌కు సంబంధించిన విద్య అభ్యసిస్తున్నాడు.

ఇతడు కాంటర్స్‌ ఆఫ్‌ లెనినిజమ్‌ పేరుతో లెనిన్‌ గురించి 15 పేజీలతో కూడిన పుస్తకాన్ని తన 15వ ఏటనే రాశాడన్నది గమనార్హం. ఆదివారం నందన్‌ ఇటలీ దేశంలోని వెనిస్‌ నగరానికి వెళుతుండగా మార్గమధ్యలో వెలనో అనే ప్రాంతంలో తస్కరణకు గురయ్యాడు. తన వద్ద ఉన్న డబ్బు, ఇతర వస్తువులు దొంగతనానికి గురవడంతో ఏం చేయాలో పాలు పోక ఇక్కట్ల పాలయ్యాడు. ఈ సంఘటన గురించి తెలిసిన నటి సుహాసిని వెంటనే తన కొడుకుకు ఎవరైనా సాయపడగలరా అంటూ అతని ఫోన్‌ నంబరును పొందుపరస్తూ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. సాయం చేయగలిగిన వారే ఆ నంబరుకు ఫోన్‌ చేయాలని, అలా చేయనివారు ఫోన్‌ చేయవద్దని పేర్కొన్నారు. అందరూ ఫోన్‌ చేసి చార్జింగ్‌ అవ్వచేయవద్దనీ మనవి చేశారు. ఈ విజ్ఞప్తికి కొన్ని గంటల వ్యవధిలోనే మంచి స్పందన వచ్చిందట. నందన్‌కు సాయం అందిందట. వెంటనే నటి సుహాసిని ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి సాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.