అమలాపాల్‌ కారు వ్యవహారంలో భిన్నాభిప్రాయం

2 Nov, 2017 08:11 IST|Sakshi

మోసం జరిగింది– గవర్నర్‌ కిరణబేడి

తప్పు జరగలేదు చట్టప్రకారమే – రవాణా మంత్రి

తమిళసినిమా: నటి అమలాపాల్‌ కారు వ్యవహారం పుదుచ్చేరి రవాణాశాఖ అధికారి, ఆ రాష్ట్ర గవర్నర్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది చిలికి చిలికి కేంద్రానికి ఫిర్యాదు చేసే స్థాయికి చేరింది. నటి అమలాపాల్‌ కొత్తగా రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసిన కారును పుదేచ్చేరిలో రిజిస్టర్‌ చేయించుకుంది.అక్కడ రోడ్డు రవాణా శాఖ పన్ను తక్కువ ఉండడమే అందుకు కారణం.అయితే పుదుచ్చేరిలో రిజిస్టర్‌ చేయించుకున్న కారును కేరళా రాష్ట్రంలో నడపడంతో ఆ ప్రభుత్వ రవాణా శాఖ సుమారు రూ.20 లక్షల వరకూ నష్టం కలిగిందట. దీంతో  ఆ రాష్ట్ర రవాణాశాఖ విచారణ జరుపుతోంది. పుదుచ్చేరిలో వాహనాలను రిజస్టర్‌ చేయాలంటే ఆక్కడ నివశిస్తున్న ఆధారాలు అవసరం అవుతాయి. అలాంటిది నటి అమలాపాల్‌ నకిలీ ఆధారాలు చూపి తన కారును రిజిస్టర్‌ చేసినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతన్నాయి.

పుదుచ్చేరి గవర్నర్‌ ఆకస్మిక తనిఖీలు
 నటి అమలాపాల్‌ కారు వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చడానికి పుదుచ్చేరి గవర్నర్‌ కరణ్‌బేడీ సిద్ధం అయ్యారు. బుధవారం కిరణ్‌బేడీ రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అనంతరం అమలాపాల్‌ కారు రిజిస్టర్‌ విషయంలో మోసానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. నటి అమలాపాల్‌కు చెందిన ఎఫ్‌సీ వంటి అధారాలను పరిశీలించకుండానే కారు రిజిస్టేషన్‌ చేశారని, అయితే ఇది చట్టబద్ధ మోసం అని గవర్నర్‌ ఆరోపించారు.ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాసినట్లు కిరణ్‌బేడీ తెలిపారు.

చట్టబద్ధంగానే జరిగింది–రవాణాశాఖమంత్రి
అయితే నటి అమలాపాల్‌ కారు విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని, అన్నీ చట్టబద్ధంగానే జరిగాయని పుదుచ్చేరి రవాణాశాఖ మంత్రి షార్జహాన్‌ పేర్కొన్నారు. అమలాపాల్‌ కర్ణాటకలో బెంజ్‌కారును కొనుగోలు చేసి దానికి చట్టబద్ధంగా తాత్కాలిక నమోదు నంబర్‌ పొందడానికి పుదుచ్చేరికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం వాహనదారుడు ఓటరు కార్డు, ఎల్‌ఐసీ, పాస్‌పోర్టు, అఫిడివిట్‌లను దాఖలు చేయాలన్నారు. దాన్ని ఆ శాఖాధికారులు పరిలీరించి కారును రిజిస్టర్‌ చేస్తారన్నారు. నటి అమాలాపాల్‌ తన సంతకంతో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేశారని, దానితో పాటు ఎల్‌ఐసీ పాలసీని, తన నివాస చిరునామా వివరాలను అందించారని  మంత్రి తెలిపారు.

అమలాపాల్‌ కారు రిజిస్టేషన్‌లో ఎలాంటి మోసం జరగలేదని, చట్టబద్ధంగానే నమోదు చేశామని వివరించారు. గవర్నర్‌ కిరణ్‌బేడీపై వ్యక్తిగత విభేదాలు లేవని, ఆమె కోరితే ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలన్ని సమర్పిం,డానికి సిద్ధమేనని పుదుచ్చేరి రవాణాశాఖ మంత్రి షార్జహాన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు