ఆ పేరొస్తే చాలు

8 Feb, 2020 02:23 IST|Sakshi

‘‘బాక్సాఫీస్‌ వసూళ్ల గురించి నేను పట్టించుకోను. నా పాత్రకి న్యాయం చేయడానికి 100శాతం కష్టపడతా. నా నటన బాగుందనే పేరు వస్తే చాలనుకునే మనస్తత్వం నాది’’ అని కేథరిన్‌ అన్నారు. విజయ్‌ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లే లెయితే కథానాయికలుగా నటించారు. కె.ఎస్‌. రామారావు సమర్పణలో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేథరిన్‌ మాట్లాడుతూ– ‘‘ప్రేమ, పెళ్లి, అనుబంధాలు వంటి అంశాలను ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంలో చక్కగా చెప్పారు. ఆధునిక ఆలోచనలతో స్వంతంత్ర భావాలున్న స్మిత అనే అమ్మాయి పాత్రలో నటించాను.

ఈ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. నేనొక బొగ్గు గనిలో పని చేస్తుంటాను. ఆ ప్రాంతంలో పని చేసే హీరోతో నాకున్న అనుబంధం ఏంటి? అతని జీవితంపై నా ప్రభావం ఎంత? అనేది ఆసక్తిగా ఉంటుంది. ఈ చిత్రంలో నలుగురు కథానాయికలు ఉన్నా అందరికీ ప్రాధాన్యత ఉంటుంది. ఇద్దరు ముగ్గురు కథానాయికలు ఉన్న చిత్రాల్లో నటించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. విజయ్‌ దేవరకొండతో పని చేయడం మంచి అనుభూతినిచ్చింది. సెట్స్‌లో ప్రశాంతంగా ఉంటూ పనిలో మాత్రం పర్‌ఫెక్షన్‌ కనబరచాలని తపిస్తాడు. ఇది నా కెరీర్‌లో విభిన్న చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. సవాల్‌తో కూడిన పాత్రలు చేసి, ప్రేక్షకుల అభిమానం పొందాలనుకుంటున్నా’’ అన్నారు.

మరిన్ని వార్తలు