మేం ముగ్గురం కష్ట సుఖాలు పంచుకున్నాం : సుకుమార్

2 Nov, 2014 23:02 IST|Sakshi
మేం ముగ్గురం కష్ట సుఖాలు పంచుకున్నాం : సుకుమార్

 ‘‘నేను, వేమా, ప్రకాశ్ ఒకప్పుడు ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం. కష్ట సుఖాలు పంచుకునేవాళ్లం. ఈ చిత్రబృందం మొత్తం నాకు తెలుసు. ఈ చిత్రం పాటలు విన్నాను. చాలా బాగున్నాయి. ‘ఆర్య’ సినిమా అప్పట్నుంచి ఎమ్మెస్ రాజుగారు నాకు సలహాలు, సూచనలు ఇస్తూ, మంచి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ ఇప్పటికే సక్సెస్ ట్రాక్‌లో ఉన్నాడు. ఈ చిత్రం అందుకు కొనసాగింపు కావాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. ఇలవల ఫిలింస్ సమర్పణలో రచయిత వేమారెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ, సీహెచ్. నరసింహాచారి, నరసింహారెడ్డి ఇలవల నిర్మిస్తున్న చిత్రం ‘చక్కిలిగింత’.
 
  సుమంత్ అశ్విన్, రెహానా జంటగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించారు. మరో అతిథి, నిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్ చిత్రబృందానికి శుభాకాంక్షలందజేశారు. మరో అతిథి, దర్శకుడు ప్రకాశ్ తోలేటి మాట్లాడుతూ - ‘‘సుకుమార్, నేను, వేమా మంచి స్నేహితులం. మా ముగ్గురిలో వేమా డిఫరెంట్. ఈ చిత్రం కూడా అలానే ఉంటుందని అనుకుంటున్నా’’ అన్నారు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సుకుమార్ ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉందని వేమారెడ్డి చెప్పారు. ఈ చిత్రం ఎవర్నీ నిరుత్సాహపరచదని సుమంత్ అశ్విన్ అన్నారు. రెండు పాటలు మినహా ఈ చిత్రం పూర్తయ్యిందని, త్వరలో పాటలను విడుదల చేయనున్నామని నిర్మాతలు చెప్పారు. ఇంకా పలువురు చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొన్నారు.