సక్సెస్‌ గ్యారంటీ అనే నమ్మకంతో ఉన్నాం – నాగశౌర్య

3 Jan, 2018 00:04 IST|Sakshi
నరేశ్, వెంకీ కుడుముల, నాగశౌర్య, శంకర్‌ ప్రసాద్‌ మూల్పూరి

‘‘సాయి శ్రీరామ్‌గారు ఇచ్చిన ధైర్యంతో మేం ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేశాం. వెంకీ సినిమాను చక్కగా తెరకెక్కించాడు. నిర్మాతలు మా తల్లిదండ్రులే. వారి గురించి పెద్దగా మాట్లాడలేను. అయితే నిర్మాతలుగా మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ‘ఛలో’ సినిమా చాలా బాగా వచ్చింది. కచ్చితంగా పెద్ద సక్సెస్‌ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని హీరో నాగశౌర్య అన్నారు. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో శంకర్‌ ప్రసాద్‌ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘ఛలో’. మహతి స్వరసాగర్‌ సంగీతం అందించారు. కొత్త సంవత్సరం సందర్భంగా సినిమాలోని రెండో పాటను సీనియర్‌ పాత్రికేయులు పసుపులేటి రామారావు, బీఏ రాజు విడుదల చేశారు.

వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘అసోసియేట్‌ డైరెక్టర్‌ని అయిన నేను ‘ఛలో’ సినిమాతో డైరెక్టర్‌గా మారాను. ఈ కొత్త ఏడాదిలో మంచి పేరున్న డైరెక్టర్‌ అవుతాననే నమ్మకం ఉంది. ఇప్పటికే రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ సాంగ్‌కు మేం ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్‌ వచ్చింది’’ అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించిన చిత్రమిది. ఫిబ్రవరి 2న సినిమాని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం’’ అన్నారు ప్రసాద్‌ మూల్పూరి. ‘‘కథ విన్నప్పుడే ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందని చెప్పా. సినిమా విడుదలకు ముందే థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు, శాటిలైట్‌ రైట్స్‌ కూడా అమ్ముడైపోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు నటుడు సీనియర్‌ నరేశ్‌. పోసాని కృష్ణమురళి, రఘుబాబు, ‘వెన్నెల’ కిశోర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్‌.

మరిన్ని వార్తలు