హలోబ్రదర్‌తో సంబంధం లేదు

30 Oct, 2018 02:53 IST|Sakshi
చందూ మొండేటి

‘‘దర్శకుడిగా నాకు థ్రిల్‌తో కూడుకున్న డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ సినిమాలే నచ్చుతుంటాయి. అవే ప్రేక్షకులకు చెప్పాలని ప్రయత్నిస్తుంటాను’’ అని చందూ మొండేటి అన్నారు. నాగచైతన్య, నిధి అగర్వాల్‌ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్, మోహన్‌ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా చందూ మొండేటి పలు విశేషాలు పంచుకున్నారు.

► ‘ట్విన్‌ వానిషింగ్‌ సిండ్రోమ్‌’కి సంబంధించిన ఓ ఆర్టికల్‌ని మా ఫ్రెండ్‌ చూపించాడు. చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఈ పాయింట్‌ని నా కథలో మిళితం చేసి చైతన్య, మైత్రీ నిర్మాతలకు చెప్పాను. అందరూ బాగా ఎగై్జట్‌ అయ్యారు. కొత్తగా ఉంటుందని అనుకున్నాం. అప్పుడే ‘సవ్యసాచి’ అనే టైటిల్‌ అయితే బావుంటుందనుకున్నాను.

► హీరోకు తెలియకుండానే తన ఎడమ చేయి పని చేస్తుందనే పాయింట్‌ని ట్రైలర్‌లో చూసి, ‘హలో బ్రదర్‌’ సినిమాతో పోలుస్తున్నారేమో. కానీ అలాంటిదేమీ లేదు. వీలున్న చోట మాత్రమే ఈ పాయింట్‌ని చూపించాం. కేవలం ఈ ఒక్క పాయింట్‌ చుట్టూనే కథ తిరగదు. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్స్, ఫైట్స్, మంచి లవ్‌ స్టోరీ అన్నీ సమపాళ్లలో ఉంటాయి.

► మాధవన్‌ ప్యాన్‌ ఇండియా యాక్టర్‌. ఆయన ఫస్ట్‌ సినిమా నుంచి చూస్తే అన్నీ విభిన్న సినిమాలే ఉంటాయి. నేను ఓ 45 నిమిషాలు కథ చెప్పగానే బావుంది చేద్దాం అనడంతో నమ్మకం వచ్చింది. ఆ తర్వాత కీరవాణి గారు తోడయ్యారు. ఆయన మార్క్‌ సంగీతం అందిచారు.

► లెగసీ ఉన్న హీరో మన సినిమాలో ఉన్నప్పుడు వాళ్ల ఫ్యామిలీ వాళ్ల పాటలు పెడితే అభిమానులకు, ప్రేక్షకులకూ సరదాగా ఉంటుంది.  ‘నిన్ను రోడ్డు మీద చూసినది...’ రీమిక్స్‌ సాంగ్‌ సెకండ్‌ హాఫ్‌లో వస్తుంది. చైతూ ఫుల్‌ జోష్‌తో చేశాడు. సాంగ్‌ టీజర్‌లో మీరు చూసింది శ్యాంపిలే. ముందుగా ఈ పాటకు తమన్నాని అనుకున్నాం. కానీ మా స్క్రిప్ట్‌కు తగట్టుగా కుదర్లే దని నిధితో చేశాం. నిధీ కూడా మంచి డ్యాన్సర్‌.

► మేమేదో కొత్త పాయింట్‌ తీశాం అని చెప్పడం లేదు. ఆల్రెడీ ఉన్న ఓ విషయాన్ని మళ్లీ చూపిస్తున్నాం. ప్రేక్షకులకు కూడా ఓ కొత్త అనుభూతి ఇస్తుందని నమ్మాం. ‘మున్నా మైఖేల్‌’ చిత్రం చూసి నిధిని సెలెక్ట్‌ చేసుకున్నాం. బాగా చేసింది. నిర్మాతలు అడిగింది అడిగినట్టు ఇచ్చారు. ఎప్పుడూ కంఫర్ట్‌ జోన్‌లో ఉంచుతారు. భూమికగారి పాత్ర నిడివి తక్కువైనా చాలా బాగుంటుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ వల్ల చిత్రం ఆలస్యం అయింది.

► ముందు ‘చాణక్య’ అనే కథ కోసం చైతన్య, నేనూ కలిశాం. కానీ అది చేయడం కుదర్లేదు. ‘ప్రేమమ్‌’ రీమేక్‌ చేశాం. ‘సవ్యసాచి’ సినిమా కోసం చైతన్య చాలా కష్టపడ్డాడు.

► నెక్ట్స్‌ ‘కార్తికేయ 2 ’ లైన్‌ ఉంది. ఆ పాయింట్‌ని డీల్‌ చేసే సామర్థ్యం నాకింకా రాలేదనుకుంటున్నాను. నాగార్జునగారి కోసం ఓ స్క్రిప్ట్‌ రెడీగా ఉంది. కానీ నెక్ట్స్‌ ఏ సినిమా ఉంటుందో చెప్పలేను.

మరిన్ని వార్తలు