త్వరలో చంద్రముఖి సీక్వెల్‌

5 Jan, 2020 15:54 IST|Sakshi

చంద్రముఖి కేవలం తమిళనాట మాత్రమే కాకుండా విడుదలైన ప్రతిభాషలోనూ విజయఢంకా మోగించింది. తమిళనాట 175 రోజులపాటు నిరంతరాయంగా ఆడి సరికొత్త రికార్డును తన పేరిట రాసుకుంది. చెన్నైలోని శాంతి థియేటర్‌లో 890 రోజులపాటు నిరంతరాయంగా ఆడి అందరి చేత ‘ఔర.. ఔరా’ అనిపించుకుంది. ఇక రజనీకాంత్‌ చెప్పే ‘లకలకలకలక..’ డైలాగ్‌ ఇప్పటికీ చాలామంద నోట్లో నానుతూనే ఉంది. ఈ సినిమాలో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, నయనతార, జ్యోతిక, ప్రభు, నజీర్‌, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. 2005లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెక్కు చెదరకుండా నిలిచింది. సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించిన ఈ హారర్‌ మూవీకి సీక్వెల్‌ వస్తే బాగుండనేది ఎంతోమంది ప్రేక్షకుల కోరిక.

ఎట్టకేలకు ఆ కోరిక నెరవేరే సమయం ఆసన్నమైనట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా చంద్రముఖి 2 రానుందన్న వార్తలు సోషల్‌ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఈ క్రమంలో తమిళ దర్శకుడు పి.వాసు మాటలు దీనికి మరింత ఊతమిస్తున్నాయి. చంద్రముఖి సినిమాతో ట్రెండ్‌ సెట్‌ చేసిన పి.వాసు దానికి సీక్వెల్‌ తీస్తున్నానని ప్రకటించాడు. దీనికి సంబంధించిన స్ర్కిప్ట్‌ దాదాపుగా సిద్ధమైనట్టేనని పేర్కొన్నాడు. ఈ సినిమాకోసం ప్రముఖ నిర్మాణ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. అయితే సీక్వెల్‌లో రజనీకాంత్‌ కనిపిస్తారా, లేదా అన్న విషయాన్ని మాత్రం ఆయన దాటవేశారు. త్వరలోనే నటీనటులను వెల్లడించనున్నారు.

చంద్రముఖి కథ ఇదీ..
‘రాజాధిరాజ.. రాజమార్తాండ.. రాజ గంభీర.. రాజ కులతిలక.. వేంకటపతిరాజ.. బహుపరాక్‌, బహుపరాక్‌’ ఈ కూతలోనే ఎక్కడలేని రాజసం, ఠీవీ. రాజు కన్నుపడితే ఏదైనా సొంతం కావాల్సిందే. దక్కకపోయిందో.. అది బూడిద కావాల్సిందే. ఈ క్రమంలో రాజు కన్నేసిన చంద్రముఖి తనకు దక్కలేదన్న కోపంతో సజీవ దహనం చేస్తాడు. ఆ తర్వాతి కాలంలో ఆత్మగా మారిన చంద్రముఖి ఎన్ని సమస్యలను సృష్టించింది.. ఆ చంద్రముఖిని ఎలా అంతం చేశారన్నది మిగతా కథ. అటు కామెడీ, ఇటు హారర్‌ రెండింటిరీ బ్యాలెన్స్‌ చేస్తూ సాగుతుందీ చిత్రం.

మరిన్ని వార్తలు