‘ఇస్మార్ట్‌’ విజయం మా ఆకలిని తీర్చింది

19 Jul, 2020 01:54 IST|Sakshi
చార్మి

‘‘సినిమా విడుదలై ఏడాది అయిన సందర్భంగా మేం ఏ సెలబ్రేషన్స్‌ చేయటంలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున అందరం ఇంటిపట్టునే ఉంటున్నాం. హీరో రామ్‌ ఫ్యాన్స్‌ కూడా కరోనా గైడ్‌ లైన్స్‌ పాటిస్తూ, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు చార్మి. రామ్‌ హీరోగా నిధి అగర్వాల్, నభా నటేశ్‌ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. పూరి కనెక్ట్స్‌పై రూపొందిన ఈ చిత్రానికి చార్మి ఓ నిర్మాత. శనివారం (జులై 18)తో ఈ సినిమా విడుదలై ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా చార్మి చెప్పిన విశేషాలు.


రామ్‌, పూరి జగన్నాథ్‌

► పూరీగారితో పాటు టీమ్‌ అందరం సక్సెస్‌ కోసం ఎంతో ఎదురుచూశాం. సక్సెస్‌ అనే ఆకలి తీరాలనుకున్నాం. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందించి మా ఆకలిని తీర్చారు పూరి.  ఈ సినిమా కథను రామ్‌ కోసమే రాశారు పూరీగారు. ఆయన కథ చెప్పినప్పుడు రామ్‌ ఏ ఎనర్జీతో ఉన్నారో షూటింగ్‌ జరుగుతున్నంత సేపు అదే ఎనర్జీ, అదే పాజిటివ్‌ యాటిట్యూడ్‌తో ఉన్నారు. రామ్‌ హీరోగా పూరీగారి దర్శకత్వంలో మరో సినిమా ఉంటుంది. అది ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెలా, మరో సినిమానా అనేది ఇప్పుడే చెప్పలేను.

► విజయ్‌ దేవరకొండతో చేస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రానికి ‘ఫైటర్‌’ టైటిల్‌నే ఫిక్స్‌ చేశాం. మిగతా భాషలన్నింటికీ కలిపి ఒకే టైటిల్‌ పెట్టాలని అనుకుంటున్నాం. ఇకనుంచి మా బ్యానర్‌లో ప్యాన్‌ ఇండియా సినిమాలు తీయాలనుకుంటున్నాం.
  
► ఓటీటీకి కంటెంట్‌ క్రియేట్‌ చేయడానికి మా పూరి కనెక్ట్స్‌ సంస్థ కూడా ప్రిపేర్‌ అవుతోంది. భవిష్యత్‌లో రెగ్యులర్‌ సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి కూడా సినిమాలు చేసుకుంటూ వెళతాం. దాదాపు అన్ని స్క్రిప్ట్‌లు పూరీగారు రాసినవే ఉంటాయి. ఓటీటీపై రూపొందించే చిత్రాల ద్వారా కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాం.
  
► ఈ లాక్‌డౌన్‌ టైమ్‌లో పూరీగారికి రైటింగ్‌ తప్ప వేరే వ్యాపకమే లేదు. నాలుగు నెలలుగా పూరీగారు రైటింగ్‌ సైడే దృష్టి పెట్టారు. భవిష్యత్‌లో పూరి కనెక్ట్స్‌ నుంచి హృదయానికి ఆనందం ఇచ్చే  కథలను ప్రేక్షకులు చూడబోతున్నారు. నటిగా ఎన్నో సినిమాలు చేశాను కానీ, ఇప్పుడు నటించాలనే ఇంట్రస్ట్‌ లేదు. మా పూరి కనెక్ట్స్‌ ద్వారా మంచి సినిమాలు తీసే ప్లానింగ్‌లో ఉన్నాం. మరో పదేళ్లకు సరిపడా ప్రొడక్షన్‌ను ఎలా ప్లాన్‌ చేయాలి, ఎలాంటి కథలు చేయాలనే ప్లాన్స్‌ జరుగుతున్నాయి.

>
మరిన్ని వార్తలు