లాయర్‌ సమక్షంలోనే విచారించాలి

25 Jul, 2017 02:49 IST|Sakshi
లాయర్‌ సమక్షంలోనే విచారించాలి
- విచారణ సమయంలో మహిళా అధికారులుండాలి
ఆ మేరకు విచారణాధికారులను ఆదేశించండి 
పిటిషన్‌పై నేడు విచారణ
 
సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో నోటీసులు అందుకున్న సినీ నటి చార్మికౌర్‌ హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం న్యాయవాది, మహిళా అధికారుల సమక్షంలోనే తన విచారణ జరిపేలా ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించాలని కోరుతూ సోమ వారం పిటిషన్‌ దాఖలు చేశారు. తన నుంచి బలవంతంగా వాంగ్మూలం తీసుకోకుండా ఆదేశించాలన్నారు. మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టకుండా, బలవంతంగా రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలను సేకరించకుండా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. పిటిషన్‌లో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ కార్యదర్శి, కమిషనర్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్, సిట్‌ సూపరింటెండెంట్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

‘‘సినీ పరిశ్రమలో కష్టపడి పైకొచ్చాను. సినీ రంగంలోని కొందరు, ఓ వర్గం మీడియా ఒత్తిళ్లకు లొంగనం దుకు నాపై అనవసర పుకార్లను ప్రచారంలోకి తెచ్చారు. టీఆర్‌పీ రేటింగ్‌లు, సర్క్యులేషన్లు పెంచుకునేందుకు తప్పుడు ప్రచారం చేశారు. సంబంధం లేని వ్యవహారాలు, వ్యక్తులతో ముడిపెడుతూ నా ప్రతిష్టను దెబ్బతీస్తున్నా రు. దురుద్దేశాలతోనే ఇదంతా చేస్తూ నన్ను బాధితురాలిగా మార్చేశారు. ఓ వర్గం మీడియా చేస్తున్న ఆరోపణలకు.. నాకు ఎలాంటి సంబంధం లేదు. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల చట్టం (ఎన్‌డీపీఎస్‌) 1985 కింద చార్మినార్, నాంపల్లి, బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లలో నమోదైన కేసుల్లో విచారణకు సం బంధించి నోటీసులు అందుకున్నాను.

వాస్త వానికి ఆ కేసులతో నాకు సంబంధం లేదు. ఆ కేసుల్లో వస్తున్న ఆరోపణలకుగానీ, ఆ కేసుల తో ప్రమేయం ఉన్న వ్యక్తులతోగానీ నాకు సంబంధం లేదు. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. దర్యాప్తు సంస్థ విచారణకు పూర్తిగా సహకరిస్తా. నా తల్లిదండ్రులు వృద్ధులు. వారు హైదరాబాద్‌లో ఉండటంలేదు. విచా రణ సమయంలో న్యాయవాదిని వెంటబెట్టు కునే హక్కు నాకు రాజ్యాంగం కల్పించింది. విచారణ అధికారులు పలువురు సినీ ప్రముఖులను పిలిచి విచారణ చేపట్టినటు మీడియా ద్వారా తెలుసుకున్నా. డాక్టర్‌ ద్వారా వారి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు తీసు కున్నట్లు కూడా కథనాలు వచ్చాయి. ఇలా చేయడం వారి ఇష్టానికి విరుద్ధం. అలాగే విచారణాధికారులు దారుణమైన ప్రశ్నలు వేస్తూ.. బలవంతంగా సమాచారం చెప్పిస్తు న్నట్లు కూడా కథనాలు వచ్చాయి.

నా విచారణ సమయంలోనూ ఇలానే వ్యవహరించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నా. డ్రగ్స్‌ కేసుతో ఎలాంటి సంబంధం లేకపోయినా.. బలవంతంగా నాకు వ్యతిరేకంగా నాతోనే వాంగ్మూలం ఇప్పించవచ్చు. నా ఇష్టానికి వ్యతిరేకంగా రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలను సేకరిస్తే ఓ అవివాహిత మహిళగా ఈ సమాజం దృష్టిలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భవిష్యత్, వృత్తి, రాజ్యాంగ హక్కులను కోల్పోతాను. అధికారుల విచారణ తీరు నా వ్యక్తిగత గోప్యత హక్కును, ప్రతిష్టను దెబ్బతీసేలా ఉండొచ్చు. విచారణ సందర్భంగా నాకు నా న్యాయవాది సహకారం అవసరం. విచార ణాధికారులు నా వాంగ్మూలాన్ని మహిళా అధికారుల సమక్షంలోనే నమోదు చేయాలి’’ అని చార్మి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై న్యాయ స్థానం మంగళవారం విచారణ చేపట్టనుంది.   
>