చార్మి నాయికగా మంత్ర 2

9 Sep, 2013 00:56 IST|Sakshi
చార్మి నాయికగా మంత్ర 2
‘‘నేను ‘మంత్ర’ చేసిన తర్వాత అలాంటి సినిమా ఎప్పుడు చేస్తారు? అని చాలామంది నన్నడిగారు. అదే తరహా సినిమా చేసే అవకాశం ఇప్పుడు దక్కింది. అయితే ‘మంత్ర’కీ ఈ సినిమాకీ పోలిక ఉండదు. ఇదొక కొత్త రకం కథ. నేను సవాల్‌గా తీసుకోవాల్సిన సినిమా’’ అన్నారు చార్మి. శ్రీమతి పద్మ సమర్పణలో తేజ ఫిలింస్ పతాకంపై బోనాల శ్రీకాంత్, పి. శౌరిరెడ్డి, రవితేజ నిర్మిస్తున్న చిత్రం ‘మంత్ర-2’. 
 
 చార్మి నాయికగా ఎస్వీ సతీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కెమెరా స్విచాన్ చేయగా బెల్లంకొండ సురేష్ క్లాప్ ఇచ్చారు. ఎన్. శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘దర్శకుడిగా ఇది తొలి చిత్రం. ‘మంత్ర’కి ఇది సీక్వెల్ కాదు. 
 
 అదే తరహాలో ఉండే హార్రర్, థ్రిల్లర్ మూవీ’’ అన్నారు. నిర్మాతల్లో ఒకరైన రవితేజ మాట్లాడుతూ - ‘‘ఈ కథకు చార్మీ అయితేనే బాగుంటుందనుకున్నాం. కథ వినగానే, ఆమె అంగీకరించారు. ‘మంత్ర’ అంతటి విజయాన్ని ఈ చిత్రం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. సంగీతదర్శకుడిగా ఐదో సినిమా అని, పాటలతో పాటు, రీ-రికార్డింగ్‌కి కూడా స్కోప్ ఉందని శివశంకర్ తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: కె. సురేష్.
 
>