చేతిలో చెయ్యేసి చెప్పు బావ

14 Sep, 2019 03:07 IST|Sakshi
అరుణ్, ఆదిత్య ఓం

‘‘దసరా బుల్లోడు’ చిత్రంలోని ‘చేతిలో చెయ్యేసి చెప్పుబావ...’ అంటూ అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ ఆడిపాడారు. ఆ పాట ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడదే పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. అరుణ్, రోహిణిపూజ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.   ఆదిత్య ఓం మరో హీరోగా నటిస్తున్నారు. కట్ల రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మేరీ కృపావతి, ప్రభుదాస్‌ సమర్పణలో కె.జె.రాజేష్, దేవదాస్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ జరుగుతోంది.  కట్ల రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘ లవ్‌ అండ్‌ హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది.

ఇద్దరు ప్రేమికులు చనిపోయినా వాళ్ల ప్రేమను ఎలా బతికించుకుంటారు? అనే నేపథ్యంలో సాగుతుంది. ఈ ఏడాది ఆఖరులో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘మా సినిమాలోని నటీనటులందరూ చాలా బాగా నటించారు’’ అన్నారు రాజేష్‌. ‘‘చాలా కాలం తర్వాత ఓ మంచి చిత్రంతో వస్తున్నా’’ అన్నారు ఆదిత్య ఓం. ‘‘నందిని’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడినే. ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాను’’ అన్నారు అరుణ్‌ రాహుల్‌.  దేవదాస్, రోహిణి పూజ, చలపతి రాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు