ఆ పేరు పెట్టినప్పుడే నమ్మకం వచ్చేసింది

13 Aug, 2018 00:35 IST|Sakshi
జస్వంత్, రాహుల్‌ రవీంద్రన్, సుశాంత్‌

సుశాంత్‌

‘‘ప్రేక్షకులకు దగ్గర కావడానికి కొత్తగా ఏదైనా ట్రై చేస్తే బావుంటుందని అనుకున్నా. ‘చి..ల..సౌ’ కథ వినగానే నాకు మరో కొత్త మెట్టు అవుతుందనిపించింది. నా నమ్మకం నిజమైంది. కరెక్ట్‌ సినిమా చేశావని చాలామంది అభినందిస్తుంటే సంతోషంగా ఉంది’’ అని హీరో సుశాంత్‌ అన్నారు. సుశాంత్, రుహానీ శర్మ జంటగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చి..ల..సౌ’. అక్కినేని నాగార్జున, భరత్‌ కుమార్, జస్వంత్‌ నడిపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదలైంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో సుశాంత్‌ మాట్లాడుతూ– ‘‘చి..ల..సౌ’ చిత్రానికి నాకు అభినందనలు వచ్చాయంటే ఆ క్రెడిట్‌ రాహుల్‌కే దక్కుతుంది. బయటి బ్యానర్‌లో సినిమా చేద్దామని అనుకున్నప్పుడు నాతో సినిమా చేయడానికి ముందుకు వచ్చిన సిరుని సినీ క్రియేషన్స్‌ వారికి థ్యాంక్స్‌. సమంత, చైతన్యకు సినిమా నచ్చడం, సినిమాలో భాగమవుతానని చైతన్య చెప్పడం హ్యాపీగా అనిపించింది. నిర్మాతగా నాగార్జునగారి పేరు కూడా పెట్టినప్పుడే సినిమాపై నమ్మకం వచ్చేసింది’’ అన్నారు.

‘‘ప్రీమియర్‌ షో నుంచి సినిమా పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. టాక్‌ వచ్చినంతగా ప్రేక్షకులు థియేటర్‌కి రావడం లేదేమో అనిపించేది. ఈ సినిమా స్లోగా ఎక్కుతుందని నాగార్జునగారు అన్నారు. ఆయన అన్నట్లుగానే ఫస్ట్‌ డేతో పోల్చితే తర్వాత అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఎక్కువయ్యాయి’’ అన్నారు రాహుల్‌ రవీంద్రన్‌. ‘‘సినిమా చేసేటప్పుడు రిస్క్‌ చేస్తున్నానని చాలామంది అన్నారు. కానీ ‘చి..ల..సౌ’ రిలీజ్‌ తర్వాత ఫోన్‌ చేసి అభినందిస్తున్నారు. సుశాంత్‌కు ఒక వే క్రియేట్‌ అయింది’’ అన్నారు నిర్మాత జస్వంత్‌.

మరిన్ని వార్తలు