మా సినిమా యూత్‌కు మాత్రమే

18 Mar, 2019 00:32 IST|Sakshi
హేమంత్, ‘తాగుబోతు’ రమేశ్, ‘సత్యం’ రాజేశ్, నిక్కీ తంబోలి, ఆదిత్, సంతోష్‌ పి. జయకుమార్‌

ఆదిత్, నిక్కీ తంబోలి జంటగా, హేమంత్, ‘తాగుబోతు’ రమేష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. సంతోష్‌ పి.జయకుమార్‌ దర్శకత్వంలో బ్లూ ఘోస్ట్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మించిన  ఈ సినిమా ఈనెల 21న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో సంతోష్‌ పి.జయకుమార్‌ మాట్లాడుతూ– ‘‘17రోజుల్లో ఈ సినిమా పూర్తి చేశాం. ఇందుకు నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం మరువలేనిది. 18 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే చూడాల్సిన సినిమా ఇది. మా సినిమా ట్రైలర్, వీడియోస్‌కు చాలా మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ఆదిత్‌ మాట్లాడుతూ – ‘‘ఇలాంటి సినిమా ఎందుకు చేస్తున్నారని చాలా మంది అడిగారు.

మాకు ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్స్‌ లేవు. రికార్డులు, రివార్డ్స్‌ లాంటివి కూడా లేవు. ఎవరూ చేయలేని స్క్రిప్ట్‌ చేయాలని అనుకుని చేసిన సినిమా ఇది. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు కాదు.. యూత్‌కి మాత్రమే’’ అన్నారు. ‘‘ఇది ప్యూర్‌ అడల్ట్‌ మూవీ. దయచేసి ఫ్యామిలీతో వెళ్లొద్దు. ఆ విషయాన్ని ట్రైలర్‌లో కూడా చెప్పాం. తమిళంలోలా ఈ సినిమా తెలుగులోనూ పెద్ద హిట్‌ అవ్వాలి’’ అన్నారు నటుడు ‘సత్యం’ రాజేష్‌. ‘‘ఈ చిత్రంలో నేను కొత్తగా ఉండే పాత్ర చేశా.  నన్ను నేను నిరూపించుకోవాలని చాలా కష్టపడ్డాను. ఆ పాత్రకు నాపేరు సూచించిన ‘సత్యం’ రాజేష్‌ అన్నకు థ్యాంక్స్‌. ’’ అని ‘తాగుబోతు’ రమేష్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో నిక్కీ తంబోలి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు