మహేంద్రన్‌పై చిన్మయి ఫైర్‌

24 Dec, 2019 08:04 IST|Sakshi
గాయనీ చిన్మయి, నటుడు వైజీ.మహేంద్రన్‌

చెన్నై, పెరంబూరు: గాయనీ, డబ్బింగ్‌ కళాకారిణి చిన్మయి మరోసారి వార్తల్లోకొచ్చారు. ఈమె మీటూ వ్యవహారంలో ప్రముఖ గీతరచయిత వైరముత్తు, సీనియర్‌ నటుడు రాధారవి వంటి వారిపై తీవ్ర విమర్శలు చేసి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. కాగా తాజాగా  మరో సీనియర్‌ నటుడు వైజీ.మహేంద్రన్‌పై ఫైర్‌ అయ్యారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లుపై భిన్న స్వరాలు వినిపిస్తున్న విషయం, ప్రతి ప్రతి పక్ష పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు  వైజీ.మహేంద్రన్‌ ఆదివారం చెన్నైలోని  ఒక కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన యువత గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోరాట కార్యక్రమాల్లో విద్యార్ధులు కళాశాలలకు సెలవులు వస్తాయనీ, ఆందోళన కార్యక్రమంలో అరెస్ట్‌ అయ్యి వ్యానులో కూర్చుని అమ్మాయిలకు సైట్‌ కొట్టవచ్చని పాల్గొంటున్నారనీ వ్యాఖ్యానించారు. ఈయన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. పలువురు  విమర్శలు చేస్తున్నారు. కాగా వైజీ.మహేంద్రన్‌ వ్యాఖ్యలపై గాయనీ చిన్మయి స్పందిస్తూ ఫైర్‌ అయ్యారు. ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొంటూ వైజీ.మహేంద్రన్‌ లాంటి వ్యక్తుల వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవాలసిన అవసరం లేదని అన్నారు. వారు అంతేననీ, మారరనీ చిన్మయి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు