వైరముత్తుపై మరోసారి చిన్మయి ఫైర్‌

10 Nov, 2019 20:56 IST|Sakshi

సాక్షి, చెన్నై:  సీనియర్‌ సినీ పాటల రచయిత వైరముత్తుపై సంచలన గాయనీ, డబ్బింగ్‌ కళాకారిణి చిన్మయి మరోసారి ఫైర్‌ అయ్యారు. అంతేకాకుండా ప్రముఖనటుడు, మక్కళ్‌ నీదిమయ్యం పార్టీ అద్యక్షుడు కమలహాసన్‌పై కూడా ఆమె పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. చిన్మయి గతంలో కూడా వైరముత్తుపై మీటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఆరోపణలు సినీ పరిశ్రమలో పెద్ద సంచలనాలనే సృష్టించాయి. ఫలితంగా తనూ నష్టపోయారు. దీంతో సయయం వచ్చినప్పుడల్లా చిన్మయి  వైరముత్తును టార్గెట్‌ చేస్తూనే ఉన్నారు. తాజాగా కమల్‌ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయంలో దివంగత దర్శకుడు కే.బాలచందర్‌ శిలావిగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి  రజనీకాంత్‌తో పాటు వైరముత్తు పాల్గొన్నారు.

దీంతో గాయనీ చిన్మయి  వైరముత్తుపై మరోసారి విరుచుకుపడ్డారు. ‘అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆయన జీవితం నశించిపోతుంది. ఇక బయట ప్రపంచంలో తలెత్తుకుని తిరగలేరు. ఇలాంటి వారిని కార్యక్రమాలకు అతిధులుగా ఎలా ఆహ్వానిస్తారు?అని  ఆరోపించారు. మీటూ  ఆరోపణలను ఎదుర్కొంటున్న  వైరముత్తు ఈ ఏడాది  పలు కార్యక్రమాల్లో, రాజకీయ కార్యక్రమాల్లోనూ అతిధిగా పాల్గొన్నారు. ఆయనకు జరిగిన నష్టం ఏమీలేదు అయితే  బాధింపుకు గురైన నేను మాత్రం నిషేధానికి గురైయ్యాను. ఇదే సినీరంగంలో పెద్దల ద్వారా నాకు లభించిన న్యాయం. అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్నవారు బహిరంగ వేదికలపై తమ ఇమేజ్‌ను ఎలా  కాపాడుకోవాలన్నది బాగానే తెలుసుకున్నారు. అలాంటి వారిలో కొందరు రాజకీయనాయకులూ ఉన్నారు. వారిని చూస్తుంటే భయం కలుగుతోంది’ అని చిన్మయి చేసిన ట్వీట్‌ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌ టాఫిక్‌గా మారింది.

మరిన్ని వార్తలు