రాధారవి కుట్రతో గెలిచారు

7 Feb, 2020 11:17 IST|Sakshi

యూనియన్‌ భవన నిర్మాణంలో డబ్బులు తినేశారు

చెన్నై, పెరంబూరు:  నటుడు రాధారవి కుట్ర పన్ని ఎన్నికల్లో గెలిచారని గాయని, డబ్బింగ్‌ కళాకారిని చిన్మయి విమర్శించారు. డబ్బింగ్‌ యూనియన్‌ భవన ని ర్మాణంలో అవక తవకలు జరిగాయని, లక్షల్లో డబ్బును తినేశారని, నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈమె కోలీవుడ్‌లో ఫైర్‌బ్రాండ్‌గా ముద్రవేసుకున్నారనే చెప్పాలి. ప్రముఖ సినీ గీత రచయిత వైరముత్తు, సీనియర్‌ నటుడు రాధారవి వంటి వారిపై మీటూ ఆరోపణలు చేసి కలకలం సృష్టించారు. వారిని క్షమించేది లేదంటూ అవకాశం కలిగినప్పుడల్లా ఫైర్‌ అవుతూనే ఉన్నారు. ఆ మధ్య వైరముత్తుకు గౌరవ డాక్టరేట్‌ బిరుదును ప్రకటించగా దాన్ని తీవ్రంగా ఖండించారు. కాగా నటుడు రాధారవికి చిన్మయికి మధ్య చాలా కాలంగా కోల్డ్‌ వార్‌ జరుగుతూనే ఉంది. సౌత్‌ ఇండియన్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా ఉన్న రాధారవి ఆ యూనియన్‌ నుంచి చిన్మయిని తొలగించారు. ఆమె వార్శిక చందాను చెల్లించని కారణంగానే సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు యూనియన్‌ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. అయితే తనపై కక్షతోనే రాధారవి తన సభ్యత్వాన్ని రద్దు చేశారని ఆరోపించిన చిన్మయి దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి విజయం సాధించింది.

అయినప్పుటికీ ఆమె సభ్యత్వాన్ని ఆమోదించేది లేదంటూ యూనియన్‌ నిర్వాహకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బుధవారం డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాధారవి అధ్యక్ష పదవికి పోటీ చేయగా ఆయనకు వ్యతిరేకంగా చిన్నయి నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఆమె నామినేషన్‌ను తిరష్కరించిన ఎన్నికల అధికారి నటుడు రాధారవిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. దీనిపై చిన్మయి ఫైర్‌ అయ్యారు. ఈమె మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఎన్నికలయినా ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరగాలన్నారు. అలాంటిది తన నామినేషన్‌ను ఎందుకు తిరష్కరించార న్నది వెల్లడించకుండా రాధారవి విజయం సాధించారని ప్రకటించడంలో అతి పెద్ద కుట్ర ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇక్కడ ఓడింది తాను మాత్ర మే అయితే మాట్లాడేదాన్ని కాదని అన్నారు. 

పలు ఏళ్లుగా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌లో సభ్యులు గా ఉన్న వందలాది మంది పారితోషకాలు నుంచి తీసుకున్న 10 శాతం డబ్బుతో యూనియన్‌ను నిర్వహిస్తున్నారని, ఆ డబ్బుతోనే  యూనియన్‌కు భ వనాన్ని కట్టబడిందని చెప్పారు. అయితే రూ. 47.5 లక్షలతో స్థలాన్ని, భవనాన్ని కట్టించి కోట్ల రూపాయలకు పైగా డబ్బింగ్‌ కళాకారుల డబ్బును స్వాహా చేశారని ఆరోపించారు. ఆ అవినీతిని బయటకు తీయడానికే తాము పోరాడుతున్నామని అన్నారు. అయితే ఎదిరించి మాట్లాడితే హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని, ఫోన్‌లో దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. అయినప్పటికీ యూనియన్‌లో రాధారవికి వ్యతిరేకంగా 45 శాతం ఓట్లు పోలయ్యాయని చెప్పారు. ఇప్పుడు తానూ వారికి వ్యతిరేకంగా మారడంతో ఓటమి ఖాయం కావడంతో దొడ్డి దారిలో రాధారవి గెలిచినట్లు ఆరోపించారు. ఈ ఎన్నికలను వ్యతిరేకిస్తూ తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చిన్మయి తెలిపారు.

మరిన్ని వార్తలు