ఆన్ లైన్ పిటిషన్ వైరల్, 15 వేల మంది సంతకాలు!

7 Mar, 2017 18:23 IST|Sakshi



మహిళలపై అత్యాచారాలకు పాల్పడతామని, యాసిడ్ దాడులు చేస్తామని సోషల్ మీడియాలో బెదిరించిన వారి ట్విటర్ ఖాతాలు తొలగించాలని ప్రముఖ గాయని శ్రీపాద చిన్మయి ఆన్ లైన్ పిటిషన్ ఫైల్ చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న వారి ట్విటర్ ఖాతాలు మూసివేయాలని ఆమె డిమాండ్ చేశారు.

'ఇలాంటి బెదిరింపులు నన్ను భయాందోళనకు గురిచేశాయి. నా జీవితం గురించి ఎంతో భయం కలుగుతోంద'ని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు దుండగులను అరెస్ట్ చేశారు. వీరిని 10 రోజుల పాటు జైలులో ఉంచారు. తనలా బెదిరింపులు, వేధింపులు ఎదుర్కొంటున్న సామాన్య మహిళలకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్న చిన్మయి ఆన్ లైన్ పిటిషన్ పెట్టారు. మహిళలను బెదిరిస్తున్న వారి ఖాతాలు మూసివేయాలని ట్విటర్ ను కోరారు.

'మహిళలపై దాడులను ప్రోత్సహించేవిధంగా ట్విటర్ ఉండకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదులతో సంబంధాలున్న ఖాతాలను తొలగిస్తున్నట్టుగానే మహిళలను వేధిస్తున్న వారి అకౌంట్లను మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. వైరల్ గా మారిన చిన్మయి ఆన్ లైన్ పిటిషన్ పై 15,364 మంది సంతకాలు చేశారు. ఇంకా 9,636 మంది సంతకాలు చేస్తే ఆమె లక్ష్యం నెరవేరుతుంది.

>