కరోనా కలకలం మొదలైనప్పటి నుంచి ప్రజలకు మెగా ఫ్యామిలీ ఎంతగానో తోడ్పాటుని అందిస్తూ వస్తుంది. ఆర్థిక సాయం అందించడమే కాకుండా పలు రకాలుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి మెగాస్టార్ చిరంజీవి లాక్డౌన్ ప్రాముఖ్యతను, కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు వీడియో సందేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి ట్వీటర్ వేదికగా వినూత్న రీతిలో ‘ కరోనా’సందేశాన్ని ఇచ్చారు. ‘మెగా’ కుటుంబ సభ్యులందిరితో ఒక ప్లకార్డు పట్టించి ఓ కరోనా మెసేజ్ ఇచ్చాడు.
‘స్టేహోం, ఇంట్లో ఉంటాం, యుద్ధం చేస్తాం, క్రిమిని కాదు ప్రేమను పంచుతాం.. కాలు కదపకుండా కరోనాని తరిమేస్తాం.. భారతీయులం ఒక్కటై భారత్ని గెలిపిస్తాం.. స్టే సేఫ్' అని చిరంజీవి నుంచి మొదలు అల్లు అరవింద్, నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్ తేజ్, ఉపాసన, చిరంజీవి ఇద్దరు కూతుళ్లు సుస్మిత, శ్రిజతో పాటు మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వరకు ప్లకార్డులు పట్టుకొని ఓ ఫోటో దిగారు. ఈ ఫోటోని చిరంజీవి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. 'మనమంతా కలిసి ఈ యుద్ధంలో గెలుస్తాం! ఎక్కడ ఉన్న వాళ్లం అక్కడే ఉందాం. మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు మనం ప్రేమించే వారిని రక్షిస్తూ.. ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచుదాం' అని పిలుపునిచ్చారు. ఇందులో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ తప్ప మిగిలిన హీరోలందరూ ఉన్నారు. దీంతో వారి అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. ‘ పవన్ ఎక్కడా?’, బన్నీ ఎక్కడా? అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.