పవన్ కళ్యాణ్ వచ్చుంటే బాగుండేది: చిరంజీవి

1 Jul, 2013 22:00 IST|Sakshi
Chiranjeevi

ఎవడు సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక జరగదనుకున్నానని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. అభిమానులు, చిత్ర యూనిట్ బలంగా కోరుకోవడంతో వేడుక జరిగిందని పేర్కొన్నారు. తన కుమారుడు చరణ్ హీరోగా నటించిన ఎవడు సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం రాత్రి శిల్పా కళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఎవడు సినిమా మగధీరకు దీటుగా ఉంటుందని తెలిపారు. అభిమానులను అన్నిరకాలుగా మెప్పిస్తుందని చెప్పారు. పవర్ ఫుల్ పాత్రలో నటించాడని తెలిపారు.  దేవిశ్రీప్రసాద్ చక్కటి సంగీతం అందిచాడని మెచ్చుకున్నారు. కెమెరామెన్ రామప్రసాద్ చరణ్ ను చాలా అందంగా చూపింశారని శభాష్ అన్నారు. దర్శకుడు పైడిపల్లి వంశీ తనకు చెప్పినట్టుగానే కథను తెరకెక్కించారని చెప్పారు. నిర్మాత దిల్ రాజు నిర్మాణ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్నారని అన్నారు.
 

ఆడియో ఆవిష్కరణకు పవన్ కళ్యాణ్ వచ్చుంటే బాగుండేదని చిరంజీవి అన్నారు. విదేశాల్లో షూటింగ్ కారణంగా కళ్యాణ్ రాలేదని తెలిపారు. 'ఎవడు' విజయోత్సవం మాత్రం పవన్ కళ్యాణ్ లేకుండా జరగదని ఆయన హామీయిచ్చారు.  ఎవడు సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.