అమితానందం

26 Sep, 2019 00:39 IST|Sakshi
అమితాబ్‌ బచ్చన్, చిరంజీవి

బాలీవుడ్‌ బిగ్‌ బి, ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమితాబ్‌ బచ్చన్‌కు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాలో చిరంజీవి పాత్ర నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్‌ నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ – ‘‘లివింగ్‌ లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును ప్రకటించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.

1969లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన అమితాబ్‌ బచ్చన్‌ స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. గడిచిన 50 ఏళ్లలో చరిత్రలో నిలిచిపోయే చిత్రాలే ఎన్నింటిలోనూ అమితాబ్‌ బచ్చన్‌ నటించి, మెప్పించారు. యుక్త వయసులో యాంగ్రీ యంగ్‌మేన్‌ అనిపించుకున్న అమితాబ్‌ జీ. ఇప్పుడు వైవిధ్యంతో కూడుకున్న సినిమాల్లో నటిస్తున్నారు. మా అబ్బాయి రామ్‌చరణ్‌ నిర్మించిన ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలోనూ నా గురువు గోసాయి వెంకన్న పాత్రను ఆయన పోషించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది’’ అన్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మించిన ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది.

మరిన్ని వార్తలు