ఫొటోషూట్‌ రెడీ

21 Mar, 2019 02:22 IST|Sakshi
చిరంజీవి

కొత్త లుక్‌లోకి మారిపోవడానికి రెడీ అవుతున్నారు చిరంజీవి. ఎందుకంటే ఆయన తర్వాతి చిత్రం కోసం. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తాయి. ఈ సినిమా పనులు ఊపందుకున్నాయి. ఇటీవల చిరంజీవిపై ఓ ఫొటోషూట్‌ జరిగిందని సమాచారం. త్వరలో చిత్రీకరణ స్టార్ట్‌ కానుంది. ఈ చిత్రంలోని పాత్ర కోసం చిరంజీవి బరువు కూడా తగ్గుతారని తెలిసింది. ఇందులో కథానాయికగా తమన్నా, నయనతార, శ్రుతీహాసన్‌ పేర్లు వినిపించాయి.

వీరిలో ఎవరో ఒకరు చిరంజీవికి జోడీగా నటిస్తారా? లేక వేరే హీరోయిన్‌ ఎవరైనా ట్రాక్‌లోకి వస్తారా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్‌ నిర్మాత. నయనతార కథానాయికగా నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్, సుదీప్, విజయ్‌ సేతుపతి తదితర భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దసరా పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు