మొదటి చూపులోనే సురేఖని చూసి  సమ్మోహితుడినయ్యా – చిరంజీవి

2 May, 2018 00:05 IST|Sakshi

సుధీర్‌బాబు జర్నలిస్ట్‌గా మరారు. యంగ్‌ హీరో అడిగిన ప్రశ్నలకు సీనియర్‌ హీరో చిరంజీవి చాలా కూల్‌గా, సరదాగా సమాధానాలిచ్చారు. ఇంతకీ సుధీర్‌ జర్నలిస్ట్‌ అవతారం ఎత్తడమేంటి? అంటే.. ఆయన హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘సమ్మోహనం’. ఈ చిత్రం టీజర్‌ని చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు అడిగిన ప్రశ్నల్లో ‘‘సురేఖ (చిరు సతీమణి)గారిని చూసి, మీరు సమ్మోహితులైన సందర్భాలున్నాయా? అంటే ‘ఫస్ట్‌ లుక్‌లోనే సురేఖని చూసి నేను సమ్మోహితుడినయ్యా’’ అని నవ్వారు చిరంజీవి. ‘సమ్మోహనం’ టీజర్‌ పై మీ అభిప్రాయం అన్న ప్రశ్నకు – ‘‘స్ట్రాంగ్‌ లవ్‌స్టోరీలా అనిపిస్తోంది.

ఆ అమ్మాయి (హీరోయిన్‌ అదితీ రావ్‌ హైదరీ) ఫ్రెష్‌నెస్‌కి అట్రాక్ట్‌ అయ్యాను. టీజర్‌లో ఆ అమ్మాయితో వ్యంగ్య ధోరణిలో 40 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయి ఎలా ఉండబోతుందో చెప్పడం.. ఆ అమ్మాయి పళ్లు రాలిపోయి, చర్మం ముడతలు పడి, కాళ్లు వంగిపోయినట్లు చూపించడం.. అంతా బాగుంది’’ అన్నారు చిరంజీవి. అలాగే, ఈ చిత్రకథ ఏంటి? కథ ఎవరిది? అని సుధీర్‌ని అడిగి తెలుసుకున్నారాయన. ‘కథ ఇందగ్రంటిగారిదే. ఒక రియల్‌ ఇన్సిడెంట్‌కి ఇన్‌స్పైర్‌ అయ్యి, రాశారు. ఒక అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి, ఓ ఫిల్మ్‌స్టార్‌కి మధ్య జరిగే లవ్‌స్టోరీ ఇది’’ అని సుధీర్‌ వివరించారు. ‘‘ఇంద్రగంటిగారి ‘అమీ తుమీ’ సినిమాని ఫ్యామిలీతో చూశాను. ఇప్పుడు చేస్తున్న ఈ ‘సమ్మోహనం’ సూపర్‌ హిట్‌ అవ్వాలి’’ అని చిత్రబృందానికి చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. 

మరిన్ని వార్తలు