మూర్తి కోసమే ఫంక్షన్‌కి వచ్చా : చిరంజీవి

21 May, 2019 20:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి నటించి స్వీయ దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థ స్నేహచిత్ర పిక్చర్స్‌ పతాకంపై తెర‌కెక్కించిన సినిమా ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ మంగళవారం సాయంత్రం మే 21న ప్రసాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్‌ చిరంజీవి నారాయణమూర్తితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన నికార్సయిన మనిషని ప్రశంసలు కురిపించారు. ‘నా మిత్రుడికి ఆనందాన్ని కలిగించేందుకే నేను ఈ ఫంక్షన్‌కి వచ్చా. నారాయణమూర్తితో నాలుగున్నర దశాబ్దాల పరిచయం నాది.

ఈ  ఆడియో వేడుకకు రావడం సంతోషంగా ఉంది. సినిమా అంటే మూర్తికి పిచ్చి. కమర్షియల్ అయిపోతున్న ఈరోజుల్లో తన కమిటిమెంట్‌తో ముందుకు సాగుతున్నాడు. అప్పటి నారాయణమూర్తి ఇప్పటి నారాయణమూర్తి ఒక్కడే. ఆస్తులు, అంతస్తులు కాదు సినిమానే ప్రాణం అనుకున్నాడు. సినిమానే ప్రేమించాడు, సినిమానే పెళ్లి చేసుకున్నాడు, సినిమాతోనే సంసారం చేస్తున్నాడు. దేశంలో ప్రజాస్వామ్యం అస్తవ్యస్తం అవుతోంది. నారాయణమూర్తి చిత్రం ఇందుకు నిదర్శనం’అన్నారు.

సినిమా అంటే మూర్తికి పిచ్చి

మరిన్ని వార్తలు