రంగస్థలం ట్విస్ట్‌ లీక్‌ చేసిన చిరు

19 Mar, 2018 11:17 IST|Sakshi

మెగా అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ఆదివారం ( మార్చి 18) నాడు విశాఖలోని ఆర్కే బీచ్‌లో మెగా అభిమానుల మధ్య సందడిగా రంగస్థలం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌, ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి అతిథిగా వచ్చారు. ట్రైలర్‌ లాంచ్‌ అనంతరం మెగాస్టార్‌ చిరు ప్రసంగిస్తూ.. పుత్రోత్సాహమో మరేమో కానీ రంగస్థలంలోని ట్విస్ట్‌ చెప్పేశాడు. ఈ సినిమా చూశానని ప్రతీ సన్నివేశం అభిమానులన అలరిస్తుందనీ, ఆర్టిస్ట్‌గా చరణ్‌ను చూసి అసూయపడుతున్నాననీ, తండ్రిగా గర్వ పడుతున్నానని ఉద్వేగంగా చెప్పారు.

రంగస్థలం సినిమా పూర్తిగా పల్లెటూరు నేపథ్యంలో ఉండబోతుందని సగటు ప్రేక్షకుడికి తెలుసు. ట్రైలర్‌ రిలీజైన తర్వాత  సినిమాలోని కథ  రాజకీయ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇందులో ఇక ట్విస్ట్‌ ఏముందీ అనుకునే లోపు... కుమార్‌బాబు(ఆది) చనిపోతాడని చిరు చెప్పేయడంతో అందరికి తెలిసిపోయింది.  కుమార్‌బాబు తమ్ముడు చిట్టిబాబు తర్వాత ఏంచేస్తాడో అందరూ ఊహించే విషయమే.

అయితే అనసూయకు సంబంధించిన పాత్ర కూడా ప్రేక్షకులకు తెలిసిపోయింది. రంగమ్మత్త క్యారెక్టర్‌లో అనసూయ నటించినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే విషయమై అనసూయను అడగ్గా అలాంటిదేమీ లేదని దాటేసింది. కానీ అదే నిజమని తేలిపోయింది. చరణ్‌ పక్కన అత్తగా చేయాలంటే మొదట ఒప్పుకోలేదనీ, సుకుమార్‌ కోసమే ఈ క్యారెక్టర్‌ చేసినట్లు చెప్పిన అనసూయ, ఈ పాత్ర తనకెంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చింది.

మరిన్ని వార్తలు