తెలుగులో చిరు, తమిళ్లో సూర్య

28 Jan, 2017 12:59 IST|Sakshi
తెలుగులో చిరు, తమిళ్లో సూర్య

యంగ్ హీరో రానా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం ఘాజీ, భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ సబ్ మెరైన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మరిన్ని అదనపు ఆకర్షణలు జోడిస్తున్నారు. రానాతో పాటు కెకె మీనన్, అతుల్ కులకర్ణి, ఓం పురి, తాప్సీలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 1971లో జరిగిన భారత్ పాక యుద్ధంలో వైజాగ్ తీరంలో అదృశ్యమైన పాక్ సబ్ మెరైన్ కథతో తెరకెక్కిస్తున్నారు.

ఫిబ్రవరి 17న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ స్టార్ హీరో సూర్యలు డబ్బింగ్ చెపుతున్నారు. తెలుగు తమిళ  హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో కీలక సన్నివేశాల్లో కథను స్టార్ హీరోలు నారేట్ చేయనున్నారు. ఇప్పటికే హిందీ వర్షన్కు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందించగా.. తెలుగు వర్షన్కు మెగాస్టార్ చిరంజీవి, తమిళ వర్షన్కు సూర్య గాత్రదానం చేసేందుకు అంగీకరించారు.

కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పీవీపీ సినిమాస్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోంది. బాలీవుడ్లో కరణ్ జోహార్ ఘాజీ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రాంభించిన చిత్రయూనిట్ సక్సెస్ పై ధీమాగా ఉన్నారు.