రత్తాలుకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఖైదీ

23 Nov, 2017 15:48 IST|Sakshi

టాలీవుడ్ కోలీవుడ్ లలో వరుస సినిమాలు చేసి లక్ష్మీ రాయ్ పెద్దగా విజయాలు సాధించలేకపోయింది. తరువాత స్పెషల్ సాంగ్స్ తో మంచి పేరు తెచ్చుకున్నా.. హీరోయిన్ గా సక్సెస్ సాధించాలన్న కల మాత్రం అలాగే మిగిలిపోయింది. పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి స్టార్ ల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. పేరును కూడా రాయ్ లక్ష్మీగా మార్చుకొని బాలీవుడ్ కు పరిచయం అవుతోంది. 2004లో బాలీవుడ్ లో సక్సెస్ సాధించిన జూలీ సినిమా సీక్వల్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.

తొలి భాగంలో నేహాదూపియా చేసిన తరహ పాత్రలోనే సీక్వల్ లో రాయ్ లక్ష్మీ నటిస్తోంది. అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా మీద రాయ్ లక్ష్మీ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో ఎలాగైన సక్సెస్ సాధించాలని భావిస్తున్న ఈ బ్యూటీ హాట్ హాట్ సన్నివేశాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు. ముఖ్యంగా దక్షిణాదిలో కూడా భారీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కోసం టాప్ స్టార్ల సాయం తీసుకుంటున్నారు. 

రాయ్ లక్ష్మీ కెరీర్ లో ఇది 50వ సినిమా కావటంతో మెగాస్టార్ చిరంజీవి ఆమెకు ప్రత్యేక వీడియో మేసేజ్ ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు. 'జూలీ 2 నీ కెరీర్ లో 50వ సినిమా కావటంతో ఇది నీకు చాలా ప్రత్యేకమైనది. నువ్వు బహుభాషా చిత్రం చేయటం ఆనందంగా ఉంది. నువ్వు జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ టు జూలీ 2' అంటూ రత్తాలు కోసం వీడియో సందేశాన్ని పంపించారు. ఈ వీడియో మెసేజ్ పై స్పందించిన రాయ్ లక్ష్మీ, మెగాస్టార్ కు కృతజ్ఞతలు తెలపటంతో పాటు అభిమానులతో తన ఆనందాన్ని షేర్ చేసుకుంది.

మరిన్ని వార్తలు