కోటీశ్వరుడు’కు అతిథిగా చిరంజీవి

5 Aug, 2014 23:23 IST|Sakshi
కోటీశ్వరుడు’కు అతిథిగా చిరంజీవి

 బుల్లితెర వీక్షకులను అమితంగా ఆకర్షిస్తున్న షో - ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ నాగార్జున తొలిసారిగా టీవీ రంగానికి వచ్చి, ఈ పాపులర్ ఫార్మట్ షోకు అతిథేయిగా వ్యవహరించడం జూన్ 9న ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కొత్త అందం తెచ్చింది. విపరీతంగా వీక్షకాదరణ సాధించి, టి.ఆర్.పి.లు తెచ్చుకున్న ఈ కార్యక్రమం తొలి సీజన్ ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది.
 
  గురువారం రాత్రి 9 గంటలకు ‘మా’ టి.వి.లో ప్రసారం కానున్న 40వ ఎపిసోడ్‌తో ప్రస్తుతానికి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ వీక్షకులకు టాటా... వీడుకోలు చెప్పనుంది. ఈ చివరి భాగానికి చిరంజీవి విశిష్ట అతిథిగా రావడం విశేషం. సామాజిక మార్పు తేవాలన్న దృక్పథంతో చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ‘మా’ టీవీ వర్గాలు తెలిపాయి. అందుకు తగ్గట్లుగానే ఎంతోమంది సామాన్యుల కలల్ని ప్రతిఫలిస్తూ, జీవితాలను మార్చేందుకు తోడ్పడిన ఈ షోలో పాల్గొనేందుకు దాదాపు 11 లక్షల మంది దాకా ఆసక్తి చూపించారు.
 
  బిగ్ సినర్జీ సంస్థ ఈ 40 భాగాలను నిర్మించింది. ఈ తొలి సీజన్‌తో షో ముగిసిపోలేదనీ, కొద్ది నెలల విరామంతో రెండో సీజన్ వచ్చే ఏడాదిలో మొదలవుతుందనీ ‘మా’ టీవీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఏమైనా, నాగార్జున, చిరంజీవి కలసి కనిపించే రేపటి ఎపిసోడ్ వీక్షకుల ఆనందాన్ని రెట్టింపు చేయడం ఖాయం. అని వేరే చెప్పాలా?