ఈ సక్సెస్‌ నా ఒక్కడిది కాదు

21 Apr, 2019 00:18 IST|Sakshi
సునీల్, పోసాని కృష్ణమురళి, ‘దిల్‌’ రాజు, సాయిధరమ్, కిశోర్‌ తిరుమల, రవిశంకర్‌

– సాయిధరమ్‌ తేజ్‌

‘‘చిత్రలహరి’ సినిమాతో తేజుకి మంచి సక్సెస్‌ రావడం చాలా సంతోషంగా ఉంది. తేజు దీన్ని ఇలాగే కొనసాగించాలి. ఫెయిల్యూర్‌ తన దరిదాపుల్లోకి కూడా రాకూడదని కోరుకుంటున్నాను’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘‘చిత్రలహరి’. కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది.

హైదారాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘సినిమాలో తేజుని చూసినప్పుడు పర్సనల్‌గా కూడా నాకు తేజునే గుర్తుకొచ్చాడు. సింపుల్‌ క్యారెక్టర్స్‌ను హీరోలకు అడాప్ట్‌ చేస్తూ కిశోర్‌ సినిమాలు చేస్తుంటారు. తన స్టామినాకు తగ్గ సక్సెస్‌ ఇంకా రాలేదనే భావిస్తున్నారు. ఇండస్ట్రీకి రాగానే మూడు బ్లాక్‌బస్టర్స్‌ సాధించిన మైత్రీ మూవీ మేకర్స్‌ చిన్న స్పీడ్‌ బ్రేకర్‌ దాటి మళ్లీ సక్సెస్‌బాట పట్టింది. సునీల్‌ తిరిగి సక్సెస్‌ ట్రాక్‌లోకి రావడం హ్యాపీగా ఉంది’’ అని అన్నారు.

‘‘కలెక్షన్స్‌ బాగా వచ్చాయి. సినిమా సక్సెస్‌ అంటున్నారు. కానీ సినిమా ప్రజలకు బాగా రీచ్‌ కావడమే నా దృష్టిలో సక్సెస్‌. ఈ సినిమా సక్సెస్‌ నా ఒక్కడిది కాదు. సినిమా చూసి స్ఫూర్తి పొందిన ప్రతి ఒక్కరికీ ఈ సక్సెస్‌ చెందుతుంది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్‌. కిశోర్‌ నా స్నేహితుడే. పోసానిగారు లవ్లీ పర్సన్‌. ఈ సినిమాలో ఆయన చేసిన పాత్రలో మా అమ్మను చూసుకున్నాను’’ అన్నారు సాయిధరమ్‌తేజ్‌. ‘‘ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను.

హీరో సాయి, దర్శకుడు కిశోర్, నిర్మాతలకు అభినందనలు’’ అన్నారు పోసాని కృష్ణమురళి. ‘‘సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు కిశోర్‌. ‘‘నాకు మంచి పాత్ర ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు సునీల్‌. ‘‘ఇప్పటివరకు 35 స్ఫూర్తి పాటలు రాశాను. ఈ సినిమా కోసం కూడా అలాంటి పాట రాశాను. ఈ విజయోత్సవ సభలో అందర్నీ చూడటం సంతోషంగా ఉంది’’ అన్నారు పాటల రచయిత చంద్రబోస్‌.

మరిన్ని వార్తలు