సియాన్ విక్రమ్ తాజా చిత్రానికి టైమ్ వచ్చింది. పాత్రల కోసం ఎందాకా అయినా వెళ్లే నటుడు విక్రమ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్నియన్, ఐ, ఇరుముగన్ వంటి చిత్రాలే అందుకు తార్కాణం. ప్రస్తుతం విక్రమ్ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి గడారం కొండాన్. ఈ చిత్రాన్ని విశ్వనటుడు కమలహాసన్ రాజ్కమల్ ఇంటర్నేషనల్ సంస్థ, ఆర్.రవీంద్రన్ టైడెంట్ ఆర్ట్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇంతకు ముందు కమలహాసన్ హీరోగా తూంగావనం చిత్రాన్ని తెరకెక్కించిన రాజేశ్ ఎం.సెల్వ దర్శకత్వం వహించారు. కమలహాసన్ రెండో కూతురు అక్షరహాసన్ ప్రధాన పాత్రను పోషించారు. ఇప్పటికే షూటింగ్ను పూర్తి చేసుకున్న గడారం కొండాన్ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇందులో విక్రమ్ మరో వైవిధ్యభరితమైన పాత్రలో నటించారు. ఆయన గెటప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది.
ఇటీవలే చిత్ర టీజర్ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు 12 మిలియన్ల ప్రేక్షకులు గడియారం కొందాన్ చిత్ర టీజర్ను వీక్షించారు. యాక్షన్, థ్రిల్లర్ చిత్రం అని తెలుస్తోంది. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ట్రైలర్ను ఈ నెల 3న విడుదల చేయనున్నారు. 19వ తేదీన చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. విక్రమ్ ప్రస్తుతం మలమాళం, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న పౌరాణిక చిత్రం మహావీర్ కర్ణలో నటిస్తున్నారు.
త్వరలో అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇది విక్రమ్కు 58వ చిత్రం. తాజాగా దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. వీరి కాంబినేషన్లో భీమ చిత్రం రూపొందింది. విక్రమ్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటిస్తున్న ధృవనక్షత్రం చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉందన్న విషయం తెలిసిందే.