తారలు ఇంటికే పరిమితం

19 Mar, 2020 07:55 IST|Sakshi
వరుణ్‌తేజ్‌ ఆదాశర్మ

కరోనా ఎఫెక్ట్‌ ఇంట్లోనే గడుపుతున్న టాలీవుడ్‌ స్టార్స్‌

బంజారాహిల్స్‌: కరోనా.. కరోనా.. ఎటుచూసినా  వైరస్‌ గురించే..జనం బయటకు అడుగుపెట్టాలంటేనే ఆలోచిస్తున్నారు.. ఇక సిటీలో అనధికారికంగా బంద్‌ కొనసాగుతుండటతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.. దీనికి సినీతారలేం అతీతం కాదు.. షూటింగ్‌లు బంద్‌ కావడంతోపాటు ఇతర కార్యకలాపాలన్నీ రద్దుచేసుకొని ఇళ్లల్లోనే ఉంటున్నారు. తమకిష్టమైన పనులు చేసుకుంటూ టైంపాస్‌ చేసుకుంటున్నారు. రెండు వారాలు సమయం దొరకడంతో సరదాగా గడుపుతున్నారు.  ఫిదా హీరో వరుణ్‌ తేజ్‌ తనకు ఇష్టమైన బాక్సింగ్‌ నేర్చుకుంటున్నాడు. తాను ఇంట్లోనే గడుపుతున్నానని ట్వీట్‌ చేశాడు. ఇక గత రెండు సంవత్సరాల  నుంచి క్షణం తీరిక లేకుండా అగ్రహీరోలతో నటిస్తున్న రష్మిక షూటింగ్‌లు నిలిపివేయడంతో ఇంటికే పరిమితమయ్యారు.

తన పెంపుడు కుక్కతో ఆడుకుంటున్నానంటూ ట్వీట్‌ చేశారు.  ఇలా తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబాలతో గడుపుతున్నారు. ఎన్నడూ లేనివిధంగా సినిమా తారలు ఎక్కువరోజులు ఇండ్ల వద్దే ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. బయటకు వెళ్లి వ్యాధులను కొని తెచ్చుకోవడంకంటే ఇంట్లోనే కుటుంబంతో గడిపితే మేలని చాలామంది ఇంట్లోనే ఉండిపోతున్నారు. పార్టీలకు దూరమయ్యారు. పబ్‌లు, క్లబ్‌లతో పాటు రిసార్ట్‌లలో పార్టీలు కూడా బంద్‌ కావడంతో నటీ నటులంతా సాధ్యమైనంతవరకు ఇంట్లోనే ఉంటూ తమ కుటుంబాలతో గడుపుతున్నారు. ఫిలింనగర్‌ షూటింగ్‌లు లేక కళ తప్పింది. తారలు బయటకు రాకపోవడంతో స్టూడియోలు, షూటింగ్‌ల స్పాట్‌లు వెలవెల పోతున్నాయి. నిత్యం షూటింగ్‌లతో కళకళలాడే రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలు బోసిపోయాయి. 

>
మరిన్ని వార్తలు