కోమాలి దర్శకుడితో విక్రమ్‌

27 Sep, 2019 10:14 IST|Sakshi

నటుడు విక్రమ్‌ మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. దక్షిణాదిలో విలక్షణ నటుడిగా పేరు పొందిన నటుడు విక్రమ్‌. పాత్ర కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధపడతారు. ప్రయోగాలు చేయడానికి ముందే విక్రమ్‌ అలా ఇటీవల నటించిన కడారం కొండాన్‌ చిత్రం నిరాశనే మిగిల్చింది. దీంతో తన కొత్త చిత్రాల విషయంలో విక్రమ్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వం వహించనున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌లో కీలక పాత్ర పోషించడానికి సిద్ధం అవుతున్నారు.

అంతకు ముందు ఇమైకా నొడిగళ్‌ చిత్రం ఫేం అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటించనున్నట్లు ఇటీవల తెలిపారు. కాగా తాజాగా అంత కంటే ముందు యువ దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. జయం రవి హీరోగా రంగనాథన్‌ తెరకెక్కించిన కోమాలి చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో చిత్ర నిర్మాత ఐసరి గణేశ్‌ దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు.

అంతే కాదు తన సంస్థలో తదుపరి చిత్రానికి ఆయన్నే దర్శకుడిగా ఎంచుకున్నారు. ఈ చిత్రంలోనే నటుడు విక్రమ్‌ హీరోగా నటించనున్నారనేది తాజా సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా విక్రమ్‌ ప్రస్తుతం ఒప్పుకున్న చిత్రాల్లో కర్ణన్‌ అనే పౌరాణిక ఇతిహాస కథా చిత్రం ఉంది. ఇది తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున రూపొందనుంది. ప్రదీప్‌ రంగనాథన్, అజయ్‌ జ్ఞానముత్తు, మణిరత్నం చిత్రాలను పూర్తి చేసిన తరువాత కర్ణన్‌ చిత్రంలో నటించనున్నారు.

మరిన్ని వార్తలు