అలీకి మాతృవియోగం

20 Dec, 2019 00:38 IST|Sakshi
తల్లి జైతన్‌తో అలీ

ప్రముఖ హాస్యనటుడు అలీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి జైతన్‌ బీబీ (75) అనారోగ్యంతో మృతిచెందారు. రాజమండ్రిలోని అలీ సోదరి నివాసంలో ఉంటున్న ఆమె అనారోగ్యంతో ఓ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.41కి కన్నుమూశారు. జైతన్‌ బీబీ భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు రాజమండ్రి నుంచి హైదరాబాద్‌లోని అలీ స్వగృహానికి తీసుకొచ్చారు. బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌ నిమిత్తం రాంచీలో ఉన్న అలీ తన తల్లి మరణ వార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్‌కి చేరుకున్నారు.

తల్లి పట్ల అలీకి ఉన్న ప్రేమానురాగాల గురించి తెలిసిందే. తల్లితో తన అనుబంధం గురించి ఆయన ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. జైతన్‌ బీబీకి ఐదుగురు సంతానంలో పెద్ద కుమారుడు అలీ, రెండో కుమారుడు ఖయ్యుం కాగా ముగ్గురు అమ్మాయిలు. జైతన్‌ బీబీ మరణవార్త తెలుసుకున్న చిరంజీవి.. అలీ ఇంటికెళ్లి ఆమెకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పలువురు సినీ, టీవీ, రాజకీయ ప్రముఖులు, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు జైతన్‌ బీబీ మృతికి సంతాపం తెలిపారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.
 
పరామర్శిస్తున్న చిరంజీవి

మరిన్ని వార్తలు