అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించాలిగా!

6 Dec, 2017 08:21 IST|Sakshi

తమిళసినిమా: అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించాలిగా అని అన్నారు నటుడు సంతానం. కామెడీ నుంచి హీరోగా మారిన ఈయన నటించిన తాజా చిత్రం చక్క పోడు పోడు రాజా. నటి వైభవి హీరోయిన్‌గా నటించిన ఇందులో వివేక్, వీటీవీ.గణేశ్, రోబోశంకర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. వీటీవీ ప్రొడక్షన్స్‌ పతాకంపై వీటీవీ.గణేశ్‌ నిర్మించిన ఈ చిత్రానికి జీఎల్‌.సేతురామన్‌ దర్శకత్వం వహించారు. సంచలన నటుడు శింబు సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఇటీవలే సెన్నార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్‌తో ఈ నెల 22వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. బుధవారం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకోనున్న చక్క పోడు పోడు రాజా చిత్ర విలేకరుల సమావేశాన్ని మంగళవారం ఉదయం చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సంతానం మాట్లాడుతూ ఇది 200 శాతం కమర్శియల్‌ అంశాలతో రూపొందిన చిత్రం అని తెలిపారు. వివేక్, వీటీవీ.గణేశ్, రోబోశంకర్, పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌ వంటి ప్రముఖ హాస్యనటులు నటించడంతో వినోదభరితంగానూ ఉంటుందన్నారు.

చిత్ర పరిశ్రమ కష్టాల్లో ఉందని అంటున్నారని, నిజానికి అలాంటిదేమి లేదని సంతానం వ్యాఖ్యానించారు. ఇక్కడ శ్రమ ముఖ్యం అన్నారు. అందరూ ఎవరి బాధ్యతలను వారు బాధ్యతాయుతంగా శ్రమించి పనిచేస్తే నష్టం అనేదే రాదన్నారు. ఇటీవల కలకలం సృష్టిస్తున్న ఫైనాన్స్‌ విషయం గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించాలిగా అని పేర్కొన్నారు. ప్రణాలికతో చిత్రాలను రూపొందిస్తే ఎవరికీ నష్టం వచ్చే అవకాశం ఉండదని,  ప్రకృతి సిద్ధమైన ఆటంకాలతో చిత్ర నిర్మాణంలో జాప్యం జరిగితే రుణ భారం పెరుగుతుందని, అలాంటి సమయాల్లో చేసిన రుణం విషయంలో చర్చించుకోవచ్చు గానీ, ప్రణాళిక లేకుండా చిత్రాలు చేసి ఆలస్యం చేసుకుని రుణభారం పెరిగిపోయిందంటే అది స్వయంకృతాపరాధమే అవుతుందన్నారు. నటుడు శింబు షూటింగ్‌ల విషయాల గురించి తనకు తెలియదు గానీ, ఈ చిత్రానికి అనుకున్న సమయంలోనే సంగీతాన్ని అందించారని అన్నారు. ఆయనపై ఇటీవల ఒక నిర్మాత చేసిన ఆరోపణల గురించి స్పందించాల్సిందిగా అడిగిన ప్రశ్నకు బుధవారం జరగనున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై తనే బదులివ్వనున్నారని సంతానం పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు