త్వరలో ఇండియా వస్తా!

26 Mar, 2015 23:35 IST|Sakshi
త్వరలో ఇండియా వస్తా!

వయసు పెరుగుతోంది... ఇక యాక్షన్ చిత్రాల్లో నటించగలుగుతానో లేదో? ఆ శక్తి ఉంటుందో లేదో? అని ఆ మధ్య ఓ సందర్భంలో జాకీ చాన్ అన్నారు. మార్షల్ ఆర్ట్స్ చిత్రాల కథానాయకునిగా ప్రపంచవ్యాప్తంగా బోల్డంత మంది అభిమానులను సొంతం చేసుకున్నారాయన. వయసు పెరుగుతోందని ఆయన సరదాగా అన్నారు కానీ, ఆరు పదుల వయసులోనూ జాకీ చాన్ ఎనర్జిటిక్‌గా సినిమాలు చేసేస్తున్నారు. ఆయన నటించిన ‘డ్రాగన్ బ్లేడ్’ ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం ‘స్కిప్ ట్రేస్’, ‘కుంగ్‌ఫూ పాండా 3’ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. అలాగే, ‘కుంగ్‌ఫూ యోగా’ అనే చిత్రంలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇండియ-చైనాకు సంబంధించిన సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనుండడం విశేషం. ఈ కలయికలో రూపొందనున్న తొలి చిత్రం ఇదేనని పరిశీలకులు అంటున్నారు. ఈ చిత్రం టైటిల్‌ను బట్టి చైనీస్ మార్షల్ ఆర్ట్ కుంగ్‌ఫూ, భారతీయ యోగా నేపథ్యంలో కథ సాగుతుందని ఊహించవచ్చు.

కథానుసారం ఈ చిత్రం షూటింగ్ ఇండియాలో కూడా చేయాల్సి ఉంటుందని, త్వరలో ఇక్కడికి వస్తానని జాకీ చాన్ ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం ఓ పని మీద ఆయన ఇండియా వచ్చారు. ఇండియా తనకు చాలా నచ్చుతుందని పేర్కొన్నారు. దాదాపు పదేళ్ల క్రితం జాకీ చాన్ నటించిన ‘ది మిత్’లో హిందీ భామ మల్లికా శెరావత్ నటించారు. మరి... హిందీ సినిమాల్లో నటిస్తారా? అనే ప్రశ్నకు - ‘‘ఆ విషయం గురించి నేను ఆలోచించలేదు. మంచి కథ దొరికితే అప్పుడాలోచిస్తా. ప్రస్తుతానికి చైనా-భారతీయ నేపథ్యంలో చేయబోతున్న ‘కుంగ్‌ఫూ యోగా’ పైనే దృష్టి సారిస్తున్నా’’ అని జాకీచాన్ చెప్పారు.