హన్సికపై ఫిర్యాదు

14 Mar, 2018 08:21 IST|Sakshi
నటి హన్సిక(ఫైల్‌)

సాక్షి, సినిమా : నటి హన్సికపై ఆమె కార్యనిర్వాహకుడు నడిగర్‌ సంఘంలో ఫిర్యాదు చేశారు. ఎంగేయుమ్‌ కాదల్‌ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన ముంబై భామ హన్సిక. ఆ తరువాత ధనుష్‌కు జంటగా మాప్పిళై, విజయ్‌ సరసన వేలాయుధం ఒరుకల్‌ ఒరు కన్నాడి, తీయవేలై చేయనుమ్‌ కుమారు వంటి చిత్రాలతో సక్సెస్‌ఫుల్‌ నటిగా ముద్ర వేసుకున్నారు. జయంరవి, ఆర్య, సిద్దార్థ్‌ వంటి యువ హీరోలతో నటించి మంచి పేరు తెచుకున్న హన్సిక శింబుతో ప్రేమ వ్యవహారంలో మినహా ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకోలేదనే చెప్పాలి. ఇటీవల హీరోయిన్‌ రేస్‌లో కాస్త వెనుకబడిన ఈ అమ్మడు నటించి తాజాగా విడుదలైన చిత్రం గులేభకావళి. ఆ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. 

ప్రస్తుతం విక్రమ్‌ప్రభుకు జంటగా తుపాకిమునై, అధర్వ సరసన ఒక చిత్రం మాత్రమే హన్సిక చేతిలో ఉన్నాయి. ఇకపోతే ఈమె వద్ద మునిస్వామి అనే వ్యక్తి మేనేజర్‌గా పని చేస్తూ వచ్చారు. అయితే ఈ మధ్య హన్సిక కాల్‌షీట్స్‌ వ్యవహారాలను ఆమె తల్లి చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హన్సిక వద్ద ఇంతకుముందు మేనేజర్‌గా పని చేసిన మునిస్వామి సోమవారం ఆమెపై నడిగర్‌సంఘంలో పిర్యాదు చేశారు. అందులో.. తాను హన్సిక వద్ద మేనేజర్‌గా పని చేసినందుకు ఎలాంటి పారితోషికం ఇవ్వలేదని, హన్సిక నుంచి తనకు రావలసిన పారితోషికాన్ని ఇప్పించాలని కోరారు. ఈ వ్యవహారంపై నటి హన్సిక ఎలా స్పందిస్తారో? నడిగర్‌సంఘం ఎలా డీల్‌ చేస్తుందో చూడాలి. 

మరిన్ని వార్తలు